31 అంతస్థుల భవనం: ఏంటీ ఆదర్శ కుంభకోణం?
ముంబై: ఆదర్శ్ కుంభకోణంలో బాంబే హైకోర్టు శుక్రవారం నాడు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో కట్టిన 31 అంతస్థుల ఆదర్శ్ భవనం అక్రమ నిర్మాణమేనని తేల్చి చెప్పిన కోర్టు ఈ భవనాన్ని కూలగొట్టాల్సిందేనని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించింది.
ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులు, రాజకీయ నేతలపై నేర విచారణ జరపాలని ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవటానికి వీలుగా తమ ఉత్తర్వులపై 12 వారాల వరకు స్టే విధించింది.
అంతేకాదు ఆదర్శ్ సొసైటీ ఖర్చులతోనే ఈ భవనాన్ని కూలగొట్టాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆదర్శ్ కుంభకోణంపై నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ సభ్యురాలు సింప్రీత్ సింగ్ ఫిర్యాదు చేయటాన్ని కోర్టు మెచ్చుకుంది. రక్షణ శాఖ కూడా భవనాన్ని కూలగొట్టటానికి తాము ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయటానికి అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అసలేంటీ ఈ ఆదర్శ కుంభకోణం?
ఆదర్శ్ సొసైటీ భవనం 1999 కార్గిల్ యుద్ధవీరులు, అమరులైన జవాన్ల కుటుంబాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు. కానీ పలువురు రాజకీయ నేతలు, రక్షణాధికారులు, ఇతర ఉన్నతాధికారులు తమకు, తమ సన్నిహిత బంధువులకు లబ్ధి కలిగేలా సొసైటీ నిబంధనలను మార్చేశారు. సైనికుల కుటుంబాలకు అందాల్సిన ఫ్లాట్లను అక్రమంగా దక్కించుకున్నారు.
దేశంకోసం ప్రాణలోడ్డే సైనికులు, వారి కుటుంబ సంక్షేమానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రాజెక్టును అవినీతి మయం చేశారు. 2003 నుంచి దీనిపై పెద్ద చర్చే సాగుతోంది. ఫ్లాట్లను దక్కించుకున్నవారిలో రాజకీయ నేతల బంధువులు, అధికారులు ఉన్నట్టు 2010లో బయటపడటంతో దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది.
31 అంతస్థుల భవనం: ఏంటీ ఆదర్శ కుంభకోణం?
అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అత్త, బంధువులకూ ఫ్లాట్లు ఉన్నట్టు తేలటంతో ఆయన రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో అశోక్ చవాన్తో పాటు మరో ఇద్దరు మాజీ సీఎంలు శివాజీరావు పాటిల్, దివంగత విలాస్రావు దేశ్ముఖ్తో పాటు కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్కుమార్ షిండేపైనా ఆరోపణలు వచ్చాయి.
31 అంతస్థుల భవనం: ఏంటీ ఆదర్శ కుంభకోణం?
ఈ ఆదర్శ్ కుంభకోణంపై ఆర్మీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తును చేస్తున్నాయి. దీనిపై కాగ్ సైతం నివేదిక సమర్పించింది. ఆదర్శ్ సొసైటీకి తీర ప్రాంత నియంత్రణ అనుమతి లేదంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ భవనాన్ని కూలగొట్టటానికి 2011లో ఉత్తర్వులు జారీచేసింది.
31 అంతస్థుల భవనం: ఏంటీ ఆదర్శ కుంభకోణం?
అశోక్ చవాన్ అనంతరం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన పృథ్వీరాజ్ చవాన్ ఈ కుంభకోణంపై న్యాయ విచారణకు ఆదేశించారు. ఆదర్శ్ సొసైటీలోని 102 మంది సభ్యుల్లో 25 మంది అనర్హులని న్యాయ కమిషన్ 2013లోనే పేర్కొంది. బినామీ పేర్లతో 22 ఫ్లాట్లను కొనుగోలు చేసినట్టూ గుర్తించింది.
31 అంతస్థుల భవనం: ఏంటీ ఆదర్శ కుంభకోణం?
'నీకిది నాకది' పద్ధతిలో చవాన్, ఇతర అధికారులు భవనానికి అనుమతులు ఇచ్చినట్టూ విచారణ నివేదికలో పేర్కొంది. కానీ చవాన్పై విచారణ జరపటానికి తగినన్ని సాక్ష్యాధారాలు లేవంటూ అప్పటి గవర్నర్ కె.శంకర నారాయణ్ అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం నాందేడ్ ఎంపీగా వ్యవహరిస్తున్న అశోక్ చవాన్పై చర్య తీసుకోవటానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవలే అనుమతి ఇచ్చారు.