పవన్ కళ్యాణ్ ట్విస్ట్: అసంతృప్తి చెందిన రైతులు?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ ప్రాంతంలోని రైతుల్లో ఒక్క రోజు పర్యటనతో ధైర్యాన్ని నింపిన జనసేన అధినేత పవన్కల్యాణ్ కేవలం 24 గంటల్లోనే మాట మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతాల్లో రైతులకు అండగా ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ హైదరాబాదులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ విధానాలు బాగున్నాయంటూ కితాబునివ్వడంపై రైతులు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. ఈ మేరకు శనివారంనాడు వార్తాకథనాలు వచ్చాయి.ట
రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో గురువారం ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, బేతపూడి, తుళ్లూరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన పవన్కల్యాణ్ తన ప్రసంగాలతో రైతులకు ధైర్యాన్ని నూరిపోశారు. ఈ క్షణం నుంచే ఉద్యమిస్తా, ఇక్కడే ఉంటా, ఆమరణ నిరాహాదీక్ష చేస్తా అంటూ తనదైన శైలిలో డైలాగులు వినిపించిన పవన్కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం ఉత్తమ ప్యాకేజీ ప్రకటించిందని అనడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఉండవల్లి, ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల్లోని రైతులు పవన్ కళ్యాణ్ తమకు అండగా ఉంటారనే విశ్వాసం రైతుల్లో వ్యక్తమైంది. భూ సమీకరణలో పాల్గొన్నప్పటికీ పవన్ ప్రసంగాల తీరును గమనించిన రైతులు తిరిగి ఇప్పిస్తారన్నంత ధైర్యాన్ని పొందారు. అయితే హైదరాబాదులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాలను భూ సమీకరణ నుంచి మినహాయించాలని పవన్ కోరారు. లేదా మంచి ప్యాకేజీ ఇచ్చి రైతులను సంతోష పెట్టాలని అన్నారు.
ఎర్రబాలెంలో పర్యటించిన సమయంలో మహిళారైతు ప్రభుత్వ ప్యాకేజీ బాగున్నందునే 20 ఎకరాల భూమిని ఇచ్చినట్లు పవన్కు తెలిపారు మిగిలిన రైతులు మాత్రం భూ సమీకరణను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అయినప్పటికీ పవన్ హైదరాబాదులో మాట్లాడిన సమయంలో ఎర్రబాలెం మినహా మిగిలిన మూడు గ్రామాల గురించి ప్రస్తావించారు. దీంతో ఎర్రబాలెం రైతులు పవన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. భూ సేకరణను ప్రభుత్వం అమలుచేసినా రైతులకు న్యాయం జరిగేవిధంగా చూస్తామని హామీ ఇవ్వడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications