వైఎస్ ఎరాలో ముద్రగడ: గన్, రివాల్వర్ పక్కన పెట్టుకుని..
కాకినాడ: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఆయన దీక్షలు ఎప్పుడూ సంచలనం సృష్టిస్తాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం 2005లో దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
పత్తిపాడు నియోజకవర్గంలోని 17 మండలాలకు చెందిన భూములు పుష్కరాల కోసం, ప్రాజెక్టుల కోసం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టారు. భూమికి భూమి నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్ష చేపట్టారు.
గన్, రివాల్వర్ పక్కన పెట్టుకుని తన నివాసంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దీక్షకు దిగారు. 2005 అక్టోబర్ 21వ తేదీన హైడ్రామా నడిచింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తొమ్మిదో రోజు ఆయన దీక్ష విరమించారు.
పద్మనాభం డిమాండ్లను అంగీకరించడానికి వైయస్ రాజశేఖర రెడ్డి తొలుత నిరాకరించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రేరేపణతో ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టారనే అభిప్రాయంతో వైయస్ రాజశేఖర రెడ్డి చలించలేదు. అయితే, ఉద్రిక్తతలను తగ్గించడానికి కాంగ్రెసు కాపు నాయకులు రంగంలోకి దిగారు.
ముద్రగడ ప్రభుత్వానికి 2015 అక్టోబర్ 21వ తేదీ ఉదయం 11 గంటలకు డెడ్లైన్ విధించారు. ఆయన చేతిలో రివాల్వర్, పక్కన గన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పక్కనే ఉన్న ఆయన కుటుంబ సబ్యులు, కాపు నాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు
దాంతో ప్రభుత్వం పల్లంరాజు చేత మధ్యవర్తిత్వం నెరిపింది. పల్లంరాజు కిర్లంపూడికి వెళ్లారు. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ తన సంతకంతో లేఖ రాశారు. తనను చంపేసుకుంటానంటూ ముద్రగడ హెచ్చరించారు. ఆ సమయంలో పల్లంరాజు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు.
మరో గంట డెడ్లైన్ పొడగించాలని ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ ముద్రగడను కోరారు. పల్లంరాజు ప్రతినిధుల బృందాన్ని ముద్రగడ లోనికి అనుమతించలేదు. లోపలి నుంచి ఇంటి గడియ వేసుకున్నారు. కిటికీ గుండా ఆయనకు లేఖను అందించారు. లేఖను చదివి తాను సంతృప్తి చెందానని, దీక్షను విరమిస్తున్నానని ముద్రగడ చెప్పారు.
పల్లంరాజు నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బృందం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో తమ పార్టీలో ఉన్న ముద్రగడ పద్మనాభం తనను కాల్చేసుకోకండా చూడడానికి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా తగిన చర్యలు తీసుకున్నారు.
చంద్రబాబు తన పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి ముద్రగడ వద్దకు వెళ్లారు. గది బయటి నుంచి వారు ముద్రగడతో మాట్లాడారు. ముద్రగడతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వం దిగిరావడం లేదు కాబట్టి తాను దీక్షను విరమించేది లేదని ముద్రగడ చెప్పినట్లు ఆయన తెలిపారు
ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గవర్నర్తోనూ ముఖ్యమంత్రితోనూ మాట్లాడారు. టిడిపి సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందాన్ని ఆయన కాకినాడకు పంపించారు. టాస్క్ఫోర్స్కు విషయం చేరవేయాలని ఆయన ఆ బృందానికి చెప్పారు. దాంతో టాస్క్ఫోర్స్ కలెక్టర్ సంతకంతో ఉన్న లేఖతో కిర్లంపూడికి హుటాహుటిన చేరుకుంది.