కిరణ్ రెడ్డి పార్టీలోకి దాసరి నారాయణరావు?
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఎలా ఉంటుందనే విషయంపై విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ సర్వే కూడా చేయించారట. సీమాంధ్రలో కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తూ వస్తున్నారు. అయితే, వారితో పోటీ పడడానికి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే సీమాంధ్రలో 35 నుంచి 40 శాతం మంది ప్రజల మద్దతు లభిస్తుందని తేలిందట. ఈ స్థితిలో మరింతగా బలోపేతం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీలోకి రావాల్సిందిగా ప్రముఖ దర్శక నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావును అడుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
సీమాంధ్రలో బలంగా ఉన్న కాపు వర్గం మద్దతు సంపాదించుకోవడానికి దాసరి నారాయణ రావును తమ వైపు లాక్కోవాలని కిరణ్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం మెగాస్టార్ చిరంజీవిని దగ్గరకు తీసుకున్నప్పటికీ దాసరి నారాయణ రావు కాంగ్రెసుకు దూరంగా ఉంటున్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత దాసరి నారాయణ రావు రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శించారు.
నిజానికి, దాసరి నారాయణ రావుకు తగిన అనుచరగణం ఉంది. ఆయన వస్తే సినీ పరిశ్రమలోని ఒక వర్గం మద్దతు కూడా కిరణ్ రెడ్డి పార్టీకి లభిస్తుంది. అయితే, పార్టీ పెడుతారా, లేదా అనే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ తేల్చడం లేదు. ఏమైనా, జనవరి 23వ తేదీ తర్వాతనే ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.