నయీం కలలు: ప్రచారం కోసం పక్కా వ్యూహం, టీవీ ఛానల్
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. నక్సలైట్ నుంచి గ్యాంగ్ స్టర్గా ఎదిగిన నయీం.. దావూద్ ఇబ్రహీంలా ఎదగాలనుకున్నాడు. అంతేకాదు, అతను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాడు కూడా.
తాజాగా, మరో కొత్త విషయం తెలిసిందే. ఇప్పటికే నయీం ఆన్ లైన్ టీవీ (ఇంటర్నెట్) నడుపుతున్నాడు. నల్గొండ, భువనగిరిలలో లోకల్ కేబుల్ ఛానల్స్ కూడా అతని మనుషులకు ఉన్నాయి. అతను త్వరలో తెలంగాణలో శాటిలైట్ టీవీ ఛానల్ను కూడా ప్రారంభించాలనుకున్నాడని తెలుస్తోంది. ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో కేబుల్ టీవీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు.
విస్తుపోయే నిజాలు: మాజీ డీఎస్పీతో లింక్, నయీం సంరక్షణ బాధ్యత ఏసీపీకి
నయీం విషయంలో నిమిష నిమిషానికో ఆసక్తికర విషయం వెల్లడవుతోంది. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. నయీం మనుషులు ఆన్ లైన్ టీవీ ఛానల్ నడుపుతున్నారని, శాటిలైట్ ఛానల్ నడపాలని ప్లాన్ చేసుకున్నారని చెప్పారు.
సొంత ప్రచారానికి ఛానల్ ప్రారంభం నయీం వ్యూహమే. ఈ ఛానల్ ద్వారా మావోయిస్టులకు వ్యతిరేకంగా, తనకు మద్దతుగా ప్రచారం చేసేలా నయీం ఇప్పటికే ఆన్ లైన్ ఛానల్ ప్రారంభించాడని, అదే ఉద్దేశ్యంతో శాటిలైట్ ఛానల్ ప్రారంభించాలనుకున్నాడని చెబుతున్నారు.
నయీమ్ కేసులో తొలి ముద్దాయి మాజీ మంత్రి: అరెస్టు అవకాశం?
ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ ఛానల్ను హైదరాబాదులోని బంజారాహిల్స్లో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేసి, కార్యక్రమాలను భువనగిరి కేంద్రంగా ఆపరేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఛానల్ కోసం నయీం స్వయంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టాడని తెలుస్తోంది. నయీం భువనగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలవాలని భావించాడు.
ఇన్ని ఆస్తులు ఎలా సమకూరాయి?
నయీం అక్రమ ఆస్తులు బయట పడుతుండటంతో వాటిపై ఆరా తీసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయింది. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బినామీ పేర్లతో ఆస్తులు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో బహిర్గతమవుతున్నాయి. వందల ఎకరాల్లో భూములు, ప్లాట్లు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పత్రాల్లో జిల్లాలో ఆయన ఆస్తుల పత్రాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని హైదరాబాద్లోని కోర్టుకు సమర్పించారు. అధికారులు, బినామీలు, అతని బంధువుల పేర్ల భూములు ఉన్నట్లు కనుగొన్నారు.
అయితే వాటి లావాదేవీలు ఏ విధంగా జరిగాయో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఆస్తుల విలువ అంచనా వేయగానే లావాదేవీలకు మధ్యవర్తులు ఎవరు, అసలు కబ్జాదారులు, వారి నుంచి ఆ భూములు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు, వారికి ఎలా సంక్రమించాయన్న విషయాలు తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
రెవిన్యూ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలకు సిద్ధమవుతున్న తెలుస్తోంది. పలుచోట్ల ప్రభుత్వ, వక్ఫ్ భూములకు చట్ట విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు, అక్రమంగా పాస్ పుస్తకాల జారీ అయినట్లు అనుమానిస్తున్నారు. ఒకసారి ప్లాట్లుగా చేసి విక్రయించిన భూములను తిరిగి ఎకరాల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్న విషయమై ఆరా తీస్తున్నారు.