ముందుచూపు... దటీజ్ ఎన్టీఆర్: టిడిపిలో ఆ స్ఫూర్తి మిగిలి ఉందా?
హైదరాబాద్: తెలుగు భాష భావాన్ని వ్యక్తపరచటంలో ఎన్టీఆర్ సరికొత్త నిర్వచనంగా నిలిచారని, ఆయన భాషను ఇతరులకు వ్యక్తీకరించే తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం కొనియాడారు. ఎన్టీఆర్ ప్రసంగాలపై ఏపీ శాసనసభ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సం రోజే పుస్తకాన్ని విడుదల చేయటం శుభపరిణామమన్నారు. అసెంబ్లీలో ప్రసంగంపై ఎన్టీఆర్ ఎంతో కసరత్తు చేసేవారని, ఆయన చేసిన శక్తిమంతమైన ప్రసంగాల ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపేవారన్నారు.
ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా చరిత్రలో నిలిచిపోయేలా చేసిన ప్రసంగాన్ని ఎప్పటికీ మరచిపోలేనని చంద్రబాబు చెప్పారు. దక్షిణ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు జాతీయ స్థాయిలో వ్యక్తిగతంగా అంత స్థాయికి ఎదగలేదని, అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైందన్నారు.
ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి ప్రస్థానం మొదలై ముప్పై అయిదేళ్లయింది. 1983 జనవరి 9న తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన వివిధ సందర్భాల్లో అసెంబ్లీలో చేసిన ప్రసంగాల ద్వారా.. నాడు ఆయన లేవనెత్తిన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు.

పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం సాధ్యం కాదని గ్రహించి దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని నాటి ప్రధాని ఇందిరా గాంధీని కోరిన దార్శనికుడు ఎన్టీఆర్. గిట్టుబాటు ధరలను నిర్ణయించే అంశంలో రైతులకు భాగస్వామ్యం కల్పించాలని నాడే ఎలుగెత్తారు.
టిడిపి 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ 'చరిత్రపుటలు' పేరు మీద ఆయన ప్రసంగాల సంకలనాన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చింది. దాని ప్రతిని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, సీఎం చంద్రబాబు మంగళవారం శాసనసభ ప్రాంగణంలో ఆవిష్కరించారు.
వ్యవసాయ ధరల విధానం అసంతృప్తికరంగా ఉందని, రైతుకు గిట్టుబాటు ధరను పరిగణలోకి తీసుకోవడం లేదని, సబ్సిడీలపై హెచ్చు మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సి చేస్తోందని, ఉత్పత్తి వ్యయం, ఉత్పాదక స్థాయి, మార్కెట్ సరళి గురించి రైతు ప్రతినిధులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించే పద్ధతి అవసరమని, రాష్ట్ర ప్రభుత్వాల ఆజమాయిషీ తప్పిమార్కెట్లో ధరలు పడిపోతే కేంద్రం రైతులకు సబ్సిడీలు అందించాలని 1983 మార్చిలో అన్నారు.
భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆటబొమ్మలుగా తయారుచేసిందని, రాజ్యాంగ పద్ధతులన్నీ భ్రష్టు పరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని దద్దమ్మలుగా తయారుచేయడం దురదృష్టకరమని, కరువు కాటకాలొచ్చినప్పుడు ఆదుకోవాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వానిది కాదా? అన్నింటినీ జానెడు గోచిలోనే ముడి పెట్టుకోవాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిటికని సమాధానం చెబుతుందో ఆలోచించాలని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.
మనం మేడల్లో ఉండి, శాసనసభలో ఏసీ రూమ్సులో కూర్చొని చర్చించడం కాదని, సామాన్యుడికి ఇళ్లు నిర్మించడమే తమ ధ్యేయమని 1985లో ఎన్టీఆర్ చెప్పారు. కానీ సామాన్యుడికి ఇళ్లు అనేది ఇప్పటికీ పార్టీల నినాదం కావడం గమనార్హం. ఆయన వరకట్న సమస్య పైన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సమయంలో బీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా తొలుత సమాజంలో కులం లేదన్న వాదనను నేను అంగీకరిస్తున్నానని, కానీ వృత్తిపరంగా మాత్రమే కులాలు వచ్చాయని మన వేదాలు చెబుతున్నాయని ఆయన చెప్పారు.
ఎన్టీఆర్ ఆశయం.. చంద్రబాబుకు వైసిపి ప్రశ్న
ఇదిలా ఉండగా, నిత్యం ఎన్టీఆర్ పేరు పలకరిస్తున్న టిడిపికి, చంద్రబాబుకు ఆయన పేరు పలవరించే నైతిక హక్కు లేదని విపక్షం మండిపడుతోంది. ఎన్టీఆర్ ఆశయాలను, ఆశలను చంద్రబాబు పూర్తిగా పక్కన పడేశారని వైసిపి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications