సినిమాలతో పవన్ కల్యాణ్ బిజీ: పొలిటిక్స్ సీరియస్
హైదరాబాద్: వరుస సినిమాలను అంగీకరిస్తూ పవన్ కల్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో బిజీ అవుతున్నారు. త్వరగా సినిమాలు పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనేది ఆయన ఉద్దేశ్యంగా చెబుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ ఆయన ఏ మాత్రం నిరాశ చెందడం లేదు.
రాజా గబ్బర్ సింగ్ సినిమా కూడా తీస్తానని ఆయన చెప్పేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఆయన నాలుగు సినిమాలు చేసేందుకు అంగీకరించారు. వీలైనంత త్వరగా ఆ సినిమాలను పూర్తి చేయాలని అయన కంకణం కట్టుకున్నారు. మైత్రీ మూవీస్, 14 రీల్స్, పివిపి లాంటి బారీ సంస్థలు ఆయన కోసం క్యూలో నిలబడ్డాయి.
అయితే, వాటిని కదాని స్నేహితుల సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చారు. మొదట ఎస్జె సూర్య దర్సకత్వంలో సినిమాను ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నారు. ఈ సినిమాను ఆయన మిత్రుడు శరత్ మరార్ తెరకెక్కించనున్నారు.
దాని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ కోసం చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు వారిని కాదని త్రివిక్రమ్, శరత్ మరార్, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఇచ్చిన మాట ప్రాకరం దాసరి నారాయణ రావు నిర్మించే ఓ సినిమాను చేయనున్నారు. తనకు ఖుషివంటి బ్లాక్ బస్టర్ అందించిన ఎఎం రత్నమ్ బ్యానర్పై కూడా ఓ సినిమాకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నాలుగు సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన రాజకీయాల వైపు మళ్లుతారని అంటున్నారు.
తాజా సర్వే కూడా పవన్ కల్యాణ్లో ఉత్సాహం నింపినట్లు చెబుతున్నారు. మూడో రాజకీయ శక్తికి స్థానం ఉందని సిఎంఎస్ సర్వే తేల్చడంతో ఇక రాజకీయాల విషయంలో వెనకడుగు వేయకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, నాలుగు సినిమాలను కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని ఆయన అనుకుంటున్నారు. మరో ఏడాది తర్వాత ఆయన రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టవచ్చుననే మాట వినిపిస్తోంది.