క్లారిటీ వచ్చాక, ఇది సీరియస్: పవన్ కళ్యాణ్ ప్రశ్నించే ముందు..!
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడలో 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'లో ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని నిలదీస్తారా? కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందన ఎలా ఉంటుంది?
ప్యాకేజీ సరే కానీ, హోదా కూడా తప్పనిసరి అని చెబుతూ కేంద్రానికి సమయం ఇస్తారా? లేక తేల్చాల్సిందేనని పట్టుబడతారా? ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతన్న చర్చ. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనే దాని పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ప్యాకేజీతో సస్పెన్స్
తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ హోదా పైన టిడిపి, వైసిపి, కాంగ్రెస్ పార్టీలను విమర్శించినప్పటికీ.. బీజేపీనే ఎక్కువ టార్గెట్ చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని, కాంగ్రెస్ పార్టీలాగే మీరూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు ప్యాకేజీ నేపథ్యంలో పవన్ స్పందన ఎలా ఉంటుందనే సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎవరి ప్రభావమైనా...
పవన్ కళ్యాణ్ హోదా ఉద్యమం ప్రభావమో, చంద్రబాబు ఒత్తిడి ప్రభావమో, విపక్షాల డిమాండ్ ప్రభావమో లేక ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న బీజేపీ లక్ష్యమో.. ఏమైనా ఏపీకి కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. హోదా ఇవ్వకపోయినప్పటికీ.. దానికి సరిసమానంగా సాయం చేస్తామని కేంద్రం చెబుతోంది. దీనిని పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు.

ప్రత్యేక హోదాకు ఇబ్బందులు
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, కానీ తమిళనాడు, కర్నాటక, బీహార్ వంటి రాష్ట్రాలు తమకూ కావాలని డిమాండ్ చేస్తున్నాయని, వాటిని ఒప్పించేందుకు సమయం తీసుకోవాల్సి వస్తుందనేది కొందరి అభిప్రాయం. సాధారణంగా ఇచ్చిన ఇతర హామీల నెరవేర్చేందుకే సమయం పడుతుందని, హోదాలాంటి పెద్ద హామీకి సమయం ఇవ్వాలని, అలా కాకపోయినా హోదా అనే పేరు లేకపోయినప్పటికీ పరోక్షంగా దాని ద్వారా వచ్చే వాటిని నెరవేర్చేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని, దీనిని పవన్ పరిగణలోకి తీసుకోవాలని గుర్తు చేస్తున్నారు.

పోలవరం నుంచి నిధుల వరకు
ఏపీకి సాయం చేయడంపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని బీజేపీ నేతలు పదేపదే గుర్తు చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంది కాబట్టే పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏపీలో కలిపామని చెబుతున్నారు. అలాగే, ఏపీకి ఆర్థిక సాయం చేస్తున్నామంటున్నారు. ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తుందని చెబుతున్నారు.

ప్రశ్నించడంలో తప్పులేదు కానీ
ప్రత్యేక హోదా పైన పవన్ ప్రశ్నించడాన్ని బీజేపీ నేతలు తప్పు పట్టడం లేదు. అయితే, కేంద్రం చేసే సాయం పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. రైల్వే, రోడ్లు, స్మార్ట్ సిటీలు, బీహెచ్ఈఎల్, బెల్, డీఆఆర్డీవో, ఎన్డీఎంసి, పెట్రో కారిడార్, విశ్వవిద్యాలయాలు.. ఇలా ఎన్నో ప్రాజెక్టులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని అంటున్నారు.

ఇంకోవైపు విపక్షాల ఎదురుదాడి
పవన్ కళ్యాణ్ హోదా పైన ప్రశ్నించడంపై విపక్షాలు కూడా స్పందిస్తున్నాయి. సిపిఎం, సిపిఐ వంటి పార్టీల స్వాగతించాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పుడప్పుడు అతిథిలా వచ్చి వెళ్లడం కాకుండా పూర్తిస్థాయి రాజకీయాలకు కేటాయించాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక, వైసిపి ఆయన పైన దుమ్మెత్తి పోస్తోంది. పవన్ చిత్తశుద్ధితో హోదా పైన ప్రశ్నించడం లేదని, నిజాయితీగా నిలదీయాలని అంటున్నారు. ఆయన ఇలా వచ్చి అలా వెళ్లే వ్యక్తి అని ఎద్దేవా చేస్తున్నారు. హోదా వంటి సీరియస్ అంశంపై స్పందించేటప్పుడు పవన్.. పూర్తిస్థాయి రాజకీయాలకు లేదా హోదా ఉద్యమానికి సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుందని, నాలుగైదు సభలు పెట్టి వెళ్తే సరిపోదని అంటున్నారు.












Click it and Unblock the Notifications