పవన్ పంచ్తో టిడిపికి రిలీఫ్: జగన్, తెరాసకు చిక్కు
ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభావం ఎవరిపై ఎంత ఉంటుందనేది రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ పార్టీ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందా, దిగితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, పవన్ లేవనెత్తుతున్న అంశాల ప్రభావంపై చర్చ జరుగుతోంది. పవన్ విమర్శల వేడి నేరుగా కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిలకు తగిలాయని చెప్పవచ్చు. కాంగ్రెసు పైన ఆయన నేరుగా ధ్వజమెత్తారు. తెరాసకు చురకలు అంటించారు. మిగిలిన పార్టీలు తమపై పవన్ ప్రసంగంపై చర్చ సాగుతోంది.
దీంతో ఇప్పుడు పవనిజం ప్రభావం ఎంత వరకు ఉంటుంది, ఎవరిపై ఉంటుందనే చర్చ సాగుతోంది. పవన్ తన పార్టీని ప్రకటించడానికి ముందు ఈ పిడుగు తమ నెత్తిన పడుతుందని టిడిపి భయపడింది. సీమాంధ్రలో ప్రాబల్యం కలిగిన ఒక సామాజిక వర్గాన్ని తమ నుంచి దూరం చేయడం ద్వారా పోయిన ఎన్నికల్లో చిరంజీవి తమను దెబ్బ తీశారని, ఈసారి అటువంటి ప్రమాదం పవన్ రూపంలో వస్తుందేమోనని అనుమానపడ్డారు.

పవన్ పార్టీ పెట్టడం జగన్కు మేలుచేసి టిడిపికి నష్టం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టకపోవడం మేలని కాపునాడు అభిప్రాయపడింది. దీనిపై బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ, పవన్ సభ తర్వాత టిడిపి నేతలు ఊపిరి పీల్చుకొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ నేతల్లో కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయమే వ్యక్తమైంది. పవన్ పార్టీ తమకు పెద్దగా అడ్డుకాదన్న అభిప్రాయంతో ఉన్నారు.
పవన్ ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో సీట్లలో పోటీ చేసే వాతావరణం లేనందున, తమకు ఆ పార్టీ పోటీ కాబోదని వారంటున్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో భిన్నమైన కోణంలో చర్చ జరుగుతోంది. కిరణ్ పార్టీ వల్ల కలిగే నష్టాన్ని పవన్ పార్టీ వల్ల టిడిపికి జరిగే నష్టంతో భర్తీ చేసుకోవచ్చునని జగన్ పార్టీ తొలుత భావించిందట. కానీ, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ భావిస్తోందట.
పవన్ నుంచి ఊహించని దాడి ఎదుర్కొన్న కాంగ్రెస్ పరిస్థితి మూలిగే నక్కపై నానుడిని గుర్తుకు తెస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి చచ్చిన పాములా ఉన్న పరిస్థితుల్లో... పవన్ కాంగ్రెస్ హఠావో అన్న పిలుపు తెలంగాణలోనూ కొంత ప్రభావం చూపవచ్చునని అంటున్నారు. తెరాస నేతలు ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నారు. పవన్ పార్టీ పెట్టకముందు ఆయనపై విరుచుకుపడిన కెసిఆర్... శనివారం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఉద్యమం పేరిట వసూళ్లు అనేది తెరాస ఎదుర్కొంటున్న పెద్ద ఆరోపణ. పవన్ మరోసారి దానినే కదిలించారు. పవన్ చేసిన విమర్శల కన్నా ఆయన చుట్టూ ఎవరున్నారు... భవిష్యత్తులో ఆయన వ్యూహం ఎలా ఉండబోతుందన్నదానిపై తెరాస వర్గాలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కొన్ని ఉద్యమ శక్తులు ఇప్పుడు పవన్ వద్దకు చేరి తెరాసకు ప్రత్యామ్నాయ వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయన్న అనుమానం ఆ వర్గాల్లో ఉంది.
పవన్ కూడా తన రాజకీయ పార్టీకి తెలంగాణలోనే బలమైన పునాదులు వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తోందని, కెసిఆర్ కుటుంబ సభ్యులపై నేరుగా దాడికి దిగడం ద్వారా ఆయనను ఢీకొనే శక్తిని తానేనన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు పంపించారని కూడా ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పైకి మాత్రం పవన్ను తేలిగ్గా కొట్టివేస్తున్నారు.
పవన్ ప్రభావం కొంత యువత, విద్యార్థులపై ఉంటుందంటున్నారు. ఆయన ఎన్నికలపై ఎంత సీరియస్గా ఉన్నారో చూసి నిర్ణయం తీసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. పవన్ పంచ్ నేరుగా కాంగ్రెస్కు తగలగా, తెరాసకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రహస్య జెండా ఉండవచ్చునని అనుమానిస్తోంది. పవన్ పార్టీ ద్వారా పెద్ద రిలీఫ్ టిడిపికే అంటున్నారు. మొదట ఆ పార్టీకే దెబ్బ అన్నప్పటికీ... పవన్ కాంగ్రెసు పార్టీని గెలవకుండా చేసేందుకు తాను అవసరమైతే చంద్రబాబు సహా అందరితో మాట్లాడుతానని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications