డిఎస్ నివేదిక: కిరణ్పై సోనియా ఆగ్రహం, అప్సెట్
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహంతో, అప్సెట్తో ఉన్నారట. కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటి నుండి కిరణ్ పలుమార్లు సమైక్య గళం వినిపిస్తున్నారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించిన తర్వాతనే విభజన పైన ముందడుగు వేయాలని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లుగా మాట్లాడారు.
కిరణ్ తీరును గమనిస్తున్న సోనియా కలత చెందారని అంటున్నారు. కిరణ్ తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులపై చర్చించనుంది.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్ అధినేత్రిని కలిసినప్పుడు తాజా రాష్ట్ర పరిస్థితులపై ఓ నివేదిక ఇచ్చారట. మరికొందరు నేతలు కూడా సోనియాను కలిశారు. అందులో పలువురు సీమాంధ్ర సమైక్య ఉద్యమం వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందని ఫిర్యాదు చేశారట.
దీంతో సోనియా వెంటనే కలుగజేసుకొని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఫోన్ చేసి తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారట. ప్రధానితో సోమవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.
సీమాంధ్ర ఉద్యమంపై ఆరా
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం, ఉద్యోగుల సమ్మె పర్యవసనాల పైన కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం వివరాలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఉద్యమం తీవ్రంగా ఉందా నిజంగా ప్రజలే స్వచ్చంధంగా పాల్గొంటున్నారా లేక కృత్రిమంగా జరుగుతోందా అనే అంశాలపై అడిగినట్లుగా సమాచారం.