టీడీపీ పక్కా స్ట్రాటజీ: ఈశ్వరిని పార్టీలోకి లాగడం వెనుక, జగన్కు బిగ్ డ్యామేజ్?..
పాదయాత్ర గురించి జనం చర్చించుకుంటున్న సమయంలో చేరికల గురించి చర్చించుకునేలా టీడీపీ వ్యూహం అమలు చేస్తోంది.
విజయవాడ: ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. అధికార పీఠమే లక్ష్యంగా జగన్ పాదయాత్రతో జనంలోకి వెళ్తున్నారు. పాదయాత్ర ద్వారా వైసీపీ పొలిటికల్ మైలేజీ ఏ మేర పెరుగుతుందో తెలియదు కానీ.. టీడీపీ మాత్రం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
పాదయాత్ర ప్రభావాన్ని తగ్గించడానికి కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉంది. రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి దేవి, పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలను పార్టీలోకి లాగడం వెనుక ఈ ఎత్తుగడలే కారణంగా తెలుస్తోంది. ఒకరకంగా ఇది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని కూడా వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
పాదయాత్ర నుంచి దృష్టి మరల్చడానికే:
జగన్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ చెబుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలకు హాజరవుతున్న జనం సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. అయితే వీరంతా వైసీపీ ఓటు బ్యాంకుగా మారుతారా? అన్నది గ్యారంటీ లేని విషయం అయినప్పటికీ.. పాదయాత్ర నుంచి వారి దృష్టి మరల్చడానికే టీడీపీ మళ్లీ ఆకర్ష్ మంత్రాన్ని మొదలుపెట్టిందన్న ప్రచారం జోరందుకుంది.
ఆ ఆడియో టేపులే ముంచాయి: ఈశ్వరి నిలదీతతో విజయసాయికి షాక్.. ఆ ఇద్దరికి బొత్స క్లాస్..
జగన్ లోపాలపై చర్చ?:
పాదయాత్ర గురించి జనం చర్చించుకుంటున్న సమయంలో చేరికల గురించి చర్చించుకునేలా టీడీపీ వ్యూహం అమలు చేస్తోంది. తద్వారా వైసీపీలో లుకలుకలు ఉన్నాయని ప్రజలు భావించేలా చేయడం వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. జగన్ నాయకత్వ లోపాల వల్లే వైసీపీ నేతలు జారిపోతున్నారన్న చర్చ ద్వారా పాదయాత్ర మైలేజీని దెబ్బకొట్టాలని టీడీపీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి చేరికలు ఊపందుకున్నాయని అనుకోవచ్చు.
జగన్కు గట్టి షాక్: మరో వికెట్ డౌన్.. టీడీపీలోకి ఎమ్మెల్యే రాజేశ్వరి, డైరెక్షన్ జ్యోతులదే!
రాజ్యసభ సీటు కూడా చేజారే:
వచ్చే మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే ఈశ్వరి కూడా పార్టీని వీడుతుండటంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 44కు పడిపోనుంది. రాజ్య సభ సీటు సాధించాలంటే 45మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో లాంఛనంగా రావాల్సిన ఆ ఒక్క సీటును కూడా వైసీపీ దూరం చేసుకున్నట్టు అవుతోంది. గత రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మూడు, వైసీపీ ఒక స్థానాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
పకడ్బంధీగా:
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ క్షేత్ర స్థాయిలో తమ వ్యూహాలను అమలు చేస్తోంది. వైసీపీ ఉనికిని పూర్తిగా దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. క్రమంగా ఎమ్మెల్యేలను లాగడం ద్వారా ఆ పార్టీ ప్రభావాన్ని వీలైనంత మేర తగ్గించాలనే యోచనలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితిని సృష్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది.
మరోవైపు అటు వైసీపీ కూడా టీడీపీ వ్యూహాలను ధీటుగా ఎదుర్కొనే వ్యూహాలేవి రచిస్తున్నట్టు కనిపించడం లేదు. ముందు నుంచి వలసల మీద వలసలు కొనసాగుతూనే ఉన్నాయి తప్ప బ్రేక్ పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సీఎం కలలు ఎంతమేర నెరవేరుతాయన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.