హైదరాబాద్లో ఓట్ల తొలగింపు: ట్విస్ట్, నీళ్లు నమిలారు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల తొలగింపు పైన వివాదం ముసురుకుంటోంది. తాము ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నామని, అయినప్పటికీ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఓట్లను తొలగించారని, తమ ఓట్లను ఎందుకు తొలగించారో చెప్పాలని స్థానికులు అధికారులను నిలదీశారు.
దీంతో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై ఈసీ పంపిన విచారణ బృందం... శనివారం కొన్ని ప్రాంతాల్లోని ఓటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి, ఆరా తీసింది.
తమకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదనీ, ఇళ్లలో కాపురం ఉంటున్నా తమ ఓట్లను తీసేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నామని, ఇప్పుడు మాత్రం జాబితాలో తమ పేరు లేదని వాపోయారు.
దీనిపై బృంద సభ్యులు అడిగిన ప్రశ్నలకు జీహెచ్ఎంసీ అధికారులు నీళ్లు నమిలారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6.30 లక్షల ఓట్లను తొలగించారని విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
దీంతో, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సునీల్ గుప్తా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ రమాకాంత్ పాండేలతో కూడిన విచారణాధికారుల బృందం.... రెండుగా బృందాలుగా ఏర్పడి, ఓట్ల తొలగింపుపై శుక్ర, శనివారాల్లో విచారణ చేపట్టాయి.
శనివారం జూబ్లీహిల్స్, సనత్నగర్ నియోజకవర్గాల పరిధిలో వారు పర్యటించారు. పలు ప్రాంతాల్లో ఓట్ల తొలగింపుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అసాధారణమైన రీతిలో ఓట్లను తొలగించారని బృంద సభ్యులు అభిప్రాయపడ్డారు. బూత్స్థాయి అధికారి (బీఎల్వో)ని కూడా వారు ప్రశ్నించారు.
కాగా, గ్రేటర్లో ఓటర్ల తొలగింపుకు కారణం ఏమిటని, ఎవరు ఒత్తిడి చేశారని జిహెచ్ఎంసీ అధికారుల పైన సిఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. అధికారులను విడివిడిగా పిలిచి అడిగారు. చాలా ఇళ్లను తిరిగి వివరాలు సేకరించారు. తమకు చెప్పకుండానే ఓట్లు తొలగించారని చాలామంది చెప్పారు.