అనంత పర్యటన: రాహుల్ కన్నా ముందే జగన్
హైదరాబాద్: ఈ నెల 24వ తేదీ నుంచి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించి రైతు కుటుంబాలను పరామర్శిస్తారు.
ఈలోగానే వైయస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆయన పర్యటన తేదీ ఖరారైంది. అనంతపురం జిల్లాలో ఇది ఆయన మూడో విడత పర్యటన. జులై 21వ తేదీ నుంచి జగన్ మూడు శాసనసభా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

తన భరోసా యాత్రలో భాగంగా జగన్ అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతపురం జిల్లాలో ఆయన ఇది వరకే రెండు పర్యాయాలు పర్యటించి రైతు కుటుంబాలను పరామర్సించారు.
కాగా, రాహుల్ గాంధీ పర్యటనపై ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ విమర్శలకు దిగింది. రాష్ట్ర విభజనపై క్షమాపణ చెప్పిన తర్వాతనే అనంతపురం జిల్లాలో రాహుల్ గాందీ అడుగుపెట్టాలని తెలుగుదేశం పార్టీ అనంతపురం శాసనసభ్యుడు ప్రభాకర్ చౌదరి అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications