బాబు నవ్వించారు:మంత్రి అశోక్ దూమపానంపై చలోక్తి
విజయవాడ: ఎప్పుడు గంభీరంగా కనిపించే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చలోక్తులతో నవ్వులు పూయించారు. విజయవాడలో ఓ హోటల్లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐ), కోడ్ ఫర్ ఏపీ అనే సంస్థల సంయుక్త నిర్వహణలో చంద్రబాబు చెణుకులు విసిరారు.
చంద్రబాబు ఎక్కువగా గంభీరంగా ఉంటారు. చలోక్తులు, నవ్వుతూ ఉండే విషయాలను అరుదుగా చూస్తుంటాం. సింగపూర్ను 'ఫైన్' దేశమని చంద్రబాబు పేర్కొనగా... అంతా అవుననే తలూపారట. అయితే, ఆ తర్వాత ఫైన్ అంటే మంచికాదని, జరిమానా అని చంద్రబాబు వివరించడంతో... ఆయన విసిరిన పన్ అర్థమై అందరూ ఒక్కసారిగా నవ్వారు.
ఆ తరహా కఠిన నిర్ణయాలు తీసుకున్న కారణంగానే సింగపూర్లో అభివృద్ధి, క్రమశిక్షణ కలగలసిపోయాయని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన పార్టీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు ధూమపానాన్ని సైతం కూడా ప్రస్తావించారు.
తాను ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు తదితరులతో కలిసి సింగపూర్ వెళ్లానని, అక్కడి జరిమానాలకు భయపడ్డ అశోక్ సింగపూర్లో ఉన్నంత కాలం సింగిల్ సిగరెట్ కూడా కాల్చలేదని తెలిపారు.
అదేంటని తాను ఆరా తీస్తే సిగరెట్ కాలిస్తే సింగపూర్ 500 డాలర్ల జరిమానా విధిస్తుందని, అంత డబ్బు తన వద్ద లేదని అశోక్ చెప్పారని తెలిపారు. అయితే అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అశోక గజపతి రాజు తిరిగి తన అలవాటును కొనసాగించారంటూ చంద్రబాబు చెప్పడంతో సదస్సులో మళ్లీ నవ్వులు పూశాయి.
మన దేశాన్ని వందల ఏళ్లు పాలించి, పీల్చి పిప్పి చేసిన బ్రిటిష్ వారు తమతో పాటు ఇక్కడి నుంచి విలువైన ఎన్నో వస్తువులను తమ దేశానికి తరలించుకుపోయారని, కానీ ఒక్కదానిని మాత్రం వదిలి మనకు మహా ఉపకారం చేశారని చెప్పారు.
సదస్సులో ఉన్న వారందరూ అదేమీటా అని ఆలోచిస్తుండగా... చంద్రబాబు మాట్లాడుతూ.. తమ అవసరాల కోసం మనకు నేర్పిన ఆంగ్ల భాషను ఇక్కడే వదిలి వెళ్లారని, అదే ఆంగ్ల భాష ప్రపంచంలో నలుమూలలా మనం జయకేతనాన్ని ఎగురవేసేందుకు ఉపయోగపడిందని బాబు చమత్కరించారు.