వ్యవసాయ విద్యపై పాలేకర్ కామెంట్లపై పెను ప్రకంపనలు...అన్ని వైపుల నుంచి విమర్శలు...స్పందించిన సిఎం

అమరావతి: ప్రకృతి సేద్యం సృష్టికర్త సుభాష్‌ పాలేకర్‌ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రకృతి సేద్యంపై ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన పాలేకర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వ్యవసాయరంగంలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ వర్సిటీలు, కళాశాలలతో పైసా ఉపయోగం లేదని..వాటిని మూసేయండంటూ పాలేకర్ వ్యాఖ్యానించడంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు మండిపడుతున్నారు.

సుభాష్ పాలేకర్ వ్యాఖ్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రకృతి సేద్యాన్ని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన వ్యవసాయ వర్సిటీలు, కాలేజీలను నిందించడం సమంజసం కాదని లాం వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల సంఘం హెచ్చరించింది. వివాదంపై స్పందించిన ఏపీ అసెంబ్లీ కోడెల శివప్రసాదరావు...ప్రకృతి వ్యవసాయం గురించి పాలేకర్‌ ఎంతైనా ప్రచారం చేసుకోవచ్చని, అయితే వ్యవసాయ వర్సిటీలపై విమర్శలు తగవని అన్నారు.

అసలు పాలేకర్ ఏమన్నారు....

అసలు పాలేకర్ ఏమన్నారు....

ఎపిలో ప్రకృతి సేద్యంపై శిక్షణ సందర్భంగా సుభాష్ పాలేకర్ చేసిన విమర్శలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అసలు సుభాష్ పాలేకర్ ఏమన్నారంటే...దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వ్యవసాయ పరిశోధనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. వాటి వల్ల రైతులకు నయా పైసా ప్రయోజనం ఉండటం లేదు. ఎందుకూ ఉపయోగంలేని వ్యవసాయ వర్సిటీలను, కళాశాలను మూసివేస్తే, ప్రభుత్వాలకు లక్షల కోట్లు మిగులుతుంది...అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వ్యవసాయరంగంలో పెను దుమారం లేపుతున్నాయి.

 విమర్శల వెల్లువ...

విమర్శల వెల్లువ...

వ్యవసాయ వర్శిటీలు, కాలేజీలు మూసివేయాలన్న పాలేకర్ వ్యాఖ్యలపై లాం వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సంఘం నాయకులు డాక్టర్‌ టీ శ్రీనివాస్‌, కార్యదర్శి డాక్టర్‌ జీ రామచంద్రరావు, ఇతర సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాస్త్రాన్ని, శాస్త్రవేత్తలను, విశ్వవిద్యాలయాలను, ప్రభుత్వాన్ని విమర్శిస్తే, తన పరిజ్ఞానం రైతుల్లో ప్రాచుర్యం పొందుతుందని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. రైతులకు మార్గదర్శకంగా ఉన్న వ్యవసాయశాస్త్రాన్నే తప్పుపట్టడం సమజంసం కాదని అన్నారు. వ్యవసాయ ఆధారిత భారత్‌లో 70శాతం ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపై జీవిస్తూ, ఒడుదుగుకులు ఎదుర్కొని పంటలు సాగు చేస్తుంటే, ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల ముంగిటకు తీసుకువెళ్లి, లాభసాటి వ్యవసాయానికి కృషి చేస్తుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనలు అవసరం లేదన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. గత 50ఏళ్లలో అనేక పరిశోధనలు చేసి, కొత్త వంగడాలు తయారుచేసి, వాటి ఫలితంగా ఆహార ఉత్పత్తి పెరిగిన విషయాన్ని మరిచి పరిశోధనలు, విశ్వవిద్యాలయం అవసరం లేదనే ఆయన వైఖరి తగదని అన్నారు.

 స్పందించిన స్పీకర్ కోడెల...

స్పందించిన స్పీకర్ కోడెల...

పాలేకర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాలేకర్‌ వ్యాఖ్యలను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు దృష్టికి తీసుకువచ్చారు. ప్రకృతి సేద్యానికి అవసరమైన ఆవులు లేని గ్రామాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో ఆవులు తీసుకురాలేము. సేంద్రీయ వ్యవసాయం వ్యర్థమని, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మూసివేయాలని చెప్పటం పాలేకర్‌కు తగదు. సేంద్రీయ వ్యవసాయాన్ని వ్యతిరేకించటం మానుకోవాలి. వానపాముల వినియోగాన్ని విమర్శించటం కూడా సరికాదు. హైబ్రీడ్‌ విత్తనాలతో దేశంలో ఎన్నో ప్రాంతాల్లో 3 నుంచి 4 రెట్లు అధిక దిగుబడులు సాధించారు. ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ సిఫార్సు మేరకు హైబ్రీడ్‌ విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఎంతో మంది పరిశోధకులు కొత్త వంగడాలను సృష్టించి రైతులకు మేలు చేశారు.

వివాదాలు...గందరగోళం...

వివాదాలు...గందరగోళం...

ఎపి ప్రభుత్వం ప్రకృతి సేద్యంపై వేలాది మంది రైతులకు, వ్యవసాయాధికారులకు, సిబ్బందికి పాలేకర్‌ను రప్పించి శిక్షణ ఇప్పిస్తోంది. డిసెంబర్‌ 31న ప్రారంభమైన శిక్షణ జనవరి 8 వరకు కొనసాగుతుంది. ఈ శిక్షణా శిబిరంలో పాలేకర్‌ ప్రతి రోజూ వ్యవసాయ వర్శిటీ, వ్యవసాయ కళాశాలలు, పరిశోధనలపై విరుచుకు పడుతున్నారు. మీడియా వద్ద కూడా అదే తరహాలో విజృంభిస్తున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసుకోవాలని, అదే ఏకైక మార్గమని సూచిస్తున్నారు. భూమిని ట్రాక్టర్లతో దున్నొద్దంటున్నారు. భూసార పరీక్షలు వద్దే వద్దంటున్నారు. సాగుకు అవసరమైన మేరకు ఆవుల సంఖ్య లేదు కదా అంటే ఉన్నవి సరిపోతాయని సూత్రీకరిస్తున్నారు. టిడిపి సర్కారు 'రైతు రథం' పేరుతో సబ్సిడీపై ట్రాక్టర్లను పంపిణీ చేస్తూ మరోపక్క ట్రాక్టర్లు వద్దంటూ పాలేకర్‌తో ప్రవచనాలు ఇప్పించడమేంటని రైతుల నుంచి ప్రశ్నలొచ్చాయి. భూసార పరీక్షల ఆధారంగా కేంద్రం రైతులకు ఎరువులిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సైతం భూసార పరీక్షలకు స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టింది. పాలేకర్‌ అవి వద్దనడంపై రైతుల్లో అయోమయం ఏర్పడింది.

 గతంలో కూడా...డాక్టరేట్ పై...

గతంలో కూడా...డాక్టరేట్ పై...

గతంలో కూడా సుభాష్ పాలేకర్‌కు డాక్టరేట్‌ ఇవ్వాలన్న ఎపి ప్రభుత్వం నిర్ణయం వివాదాస్పదమైంది. పాలేకర్‌కు డాక్టర్‌రేట్‌ ఇస్తామనడాన్ని నిరసిస్తూ వ్యవసాయశాఖ నిపుణులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. పాలేకర్‌కు డాక్టరేట్‌ ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, వ్యవసాయరంగానికి పాలేకర్‌ కంటే ఎక్కువ సేవ చేసిన వారు చాలా మంది ఉన్నారని.. వారిని గుర్తించి డాక్టరేట్‌ ఇవ్వాలని వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.

వివాదంపై...సిఎం స్పందన...

వివాదంపై...సిఎం స్పందన...

వ్యవసాయ విద్యపై పాలేకర్ వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వివాదంపై స్పందించారు...చేసేది మంచి పనే, అలా అని మిగతావన్నీ పనికిరానివని అంటే ఎలా?' అని సిఎం అభిప్రాయపడినట్లు సమాచారం. అలాగే ప్రకృతి సేద్యానికి శాస్ర్తీయత లేదని వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ అనడం కూడా తప్పన్నారు. రైతాంగం కోసం, సమాజ అభివృద్ధి కోసం ఎవరి మార్గాల్లో వారు పనిచేస్తున్నారని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అర్థరహితమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+