ఐటీ బూమ్: ఆ టాప్ టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగావకాశాలు.. టాలెంటెడ్ యువతకు డిమాండ్..


ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్),ఇన్ఫోసిస్,విప్రో భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్లకు సిద్దమవుతున్నాయి. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా దాదాపు 40వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు టీసీఎస్ ప్లాన్ చేస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ 25వేల మందిని రిక్రూట్‌ చేసుకునే యోచనలో ఉంది. గతేడాది కంటే ఎక్కువమందినే రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించిన విప్రో... ఆ నంబర్‌ను మాత్రం వెల్లడించలేదు. డిజిటల్ కార్యకలాపాలపై ఈ కంపెనీలు ఫోకస్ చేయడంతో కొత్త రిక్రూట్‌మెంట్లకు అవకాశం ఏర్పడింది.

దాదాపు 1,10,000 కొత్త ఉద్యోగాలు...

ఐటీ వృద్ది రేటు గణనీయంగా పెరిగిందని... కొత్త ప్రాజెక్టుల నిర్వహణకు రిక్రూట్‌మెంట్లు అవసరమని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు గతవారం వెల్లడించారు. కాబట్టి ప్రతిభ గల యువతకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. ఐటీ సెక్టార్‌ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం... ఈ ఏడాది టీసీఎస్,విప్రో,ఇన్ఫోసిస్,హెచ్‌సీఎల్ టెక్నాలజీ,టెక్ మహీంద్రా కంపెనీల్లో దాదాపు 1,10,000 రిక్రూట్‌మెంట్లు జరగనున్నాయి. ఈ ఐదు టెక్ కంపెనీల్లో గతేడాదితో పోల్చితే 20వేల రిక్రూట్‌మెంట్లు అధికంగా జరగనున్నాయి.

టీసీఎస్‌లో తగ్గిన అట్రిషన్ రేటు...

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్‌ అట్రిషన్ రేటు(కంపెనీని విడిచే ఉద్యోగుల సంఖ్య) 7.2శాతానికి తగ్గింది. అదే సమయంలో ఇన్ఫోసిస్,విప్రో కంపెనీల్లో మాత్రం ఇది ఎక్కువగా ఉంది. ఈ ఏడాది కూడా తమ కంపెనీల్లో అట్రిషన్ రేటు పెరుగుతుందని... అదే సమయంలో ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అట్రిషన్ రేటునే మరో రెండు త్రైమాసికాల వరకు నిలుపుకునే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ అధికారి ప్రవీణ్ రావు తెలిపారు. పరిహారం,ప్రమోషన్లు,ఇతరత్రా చర్యలు అట్రిషన్ రేటును తగ్గిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement
ఇప్పటికే ఇన్ఫోసిస్ 20వేల రిక్రూట్‌మెంట్లు..

ఈ ఏడాది ఇప్పటికే 20వేల మందిని కొత్తగా రిక్రూట్‌ చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ అధికారి ప్రవీణ్ రావు తెలిపారు. మరో 25వేల మందిని త్వరలోనే రిక్రూట్‌ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గొవిల్ మాట్లాడుతూ... అట్రిషన్ పరంగా నిరంతర ఒత్తిడిని చవిచూస్తున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ,ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్,డొమైన్ ఎక్స్‌పర్ట్స్ తదితర నిపుణులకు స్కిల్ ఆధారిత బోనస్‌లను అందించనున్నట్లు తెలిపారు. తద్వారా ప్రతిభ గల ఉద్యోగులను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ త్రైమాసికంలో 3వేల మందిని రిక్రూట్‌మెంట్ చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

ఆ కంపెనీల్లోనూ....


డీఎక్స్‌సీ టెక్నాలజీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నచికేత్ సుక్తాంకర్ మాట్లాడుతూ... గతేడాది 4500 మందిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా రిక్రూట్‌ చేసుకోగా... ఈ ఏడాది 7వేల మందిని రిక్రూట్ చేసుకున్నట్లు చెప్పారు. మైండ్ ట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దెబాషిశ్ ఛటర్జీ మాట్లాడుతూ... గత త్రైమాసికంలో 1600 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు తెలిపారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు చెప్పారు. మైండ్ ట్రీ అట్రిషన్ రేటు వరుసగా రెండు త్రైమాసికాల్లో గణనీయాల్లో తగ్గి 12.5శాతంగా నమోదైంది.

Read more...

English Summary

TCS plans to hire over 40,000 people from campuses this year, while Infosys is likely to recruit nearly 25,000 people from campuses. Wipro, which has not provided a hiring plan, said it will onboard more people than last year.