AP IIIT Admissions 2026: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్-పూర్తి వివరాలివే..!
ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు (AP IIIT Admissions 2026) నోటిఫికేషన్ విడుదలైంది. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్లలో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాలను వీటి ద్వారా నిర్వహిస్తారు. పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తూ వర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి, రిజిస్ట్రార్, అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ వివరాలను వెల్లడించారు.
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు ఆన్లైన్ దరఖాస్తులు మే 1 నుంచి మే 30 వరకు స్వీకరిస్తారు. జూన్ 12న ఎంపిక జాబితా విడుదల చేస్తారు. జూలై 1న నాలుగు ఐఐఐటీ క్యాంపస్ లలో తరగతులు ప్రారంభమవుతాయి. గత ఏడాది జూలై 15న తరగతులు ప్రారంభం కాగా, ఈసారి 15 రోజుల ముందుగానే అంటే జూలై 1 నుంచే పీయూసీ-1 తరగతులను ప్రారంభించాలని యూనివర్శిటీ నిర్ణయించింది. అలాగే పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే విద్యా సంవత్సరం (2026-27) మొదలవుతున్నందున, కొత్త విద్యార్థులు కూడా వారితో పాటే అకడమిక్ క్యాలెండర్ను అనుసరించేలా ఈ మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

పదవ తరగతి 2026లో ఆంధ్రప్రదేశ్ బోర్డు, సీబీస్ఈ లేదా ఐసీఎస్ఈ నుంచి పాసైన వారు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అర్హులు. ఏపీ స్థానికులకు 85% సీట్లు; మిగిలినవారికి 15% సీట్లు కేటాయిస్తారు. అడ్మిషన్ల కోసం https://admissions.rgukt.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్టర్, ఫీజు చెల్లించి, వివరాలు ఫిల్ చేసి, పదో తరగతి మార్కులు, ఫోటో, సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఫీజు జనరల్ ₹300, ఎస్సీ, ఎస్టీలకు ₹200, ఇతరులకు ₹1000గా నిర్ణయించారు. ప్రస్తుతం దేశంలో అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంల స్దాయిలో ఇక్కడ విద్యనభ్యసించే అవకాశం ఉండటంతో వీటికి ఎంతో డిమాండ్ ఉంటోంది.














Click it and Unblock the Notifications