ప్రమాదాల్నీ కుట్రగా మార్చేస్తారా?- మీ ఎమ్మెల్యేల సంగతేంటి ? జగన్ ఫైర్..!
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఓ గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసిన కేసును కుట్రగా మార్చి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మండిపడ్డారు. ఇవాళ జిల్లాలోని అంపోలు జైల్లో సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చిన జగన్.. తన టూర్ ఆలస్యం కారణంగా ములాఖత్ లో కలవలేకపోయారు. అనంతరం అప్పలరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్.. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
నడి రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కుట్రగా మార్చి వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుమారుడిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని జగన్ తప్పుబట్టారు. యాక్సిడెంట్ లో కుట్రకోణం ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించారు. దారిన పోయే గొర్రెల కాపరితో సీదిరి అప్పలరాజు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనను పట్టుకుని అప్పలరాజు కుమారుడి కెరీర్ నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీకి చెందిన బీసీ నాయకుడిపై కుట్రలకు తెరలేపడం ధర్మమేనా అని జగన్ ప్రశ్నించారు.

అప్పలరాజు తన సొంత కష్టంపై చదువుకుని డాక్టర్ అయిన వ్యక్తి అని, లోకేష్ లా డొనేషన్ కట్టి సీటు తెచ్చుకోలేదని జగన్ ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తిపై కక్ష గట్టి, తప్పుడు కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. గొర్రెలకాపరిని యాక్సిడెంట్ చేశాక అప్పలరాజు కుమారుడు 108కి ఫోన్ చేశాడని, సీపీఆర్ కూడా చేశారని జగన్ గుర్తుచేశారు. కుట్ర ఉద్దేశమే ఉంటే ఇవన్నీ చేసేవారా అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడని, పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు మరో యాక్సిడెంట్ చేశారని, వారి విషయంలోనూ ఇవే కుట్ర కేసులు నమోదు చేసి జైలుకు పంపగలరా అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం ఎందుకని చంద్రబాబును జగన్ నిలదీశారు.














Click it and Unblock the Notifications