బెంగళూరు: అన్ని రాష్ట్రాల తరహాలోనే కర్ణాటకలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. అడ్డు, అదుపు లేకుండా చెలరేగిపోతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న బెంగళూరు.. చివురుటాకులా వణికిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 36,556 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క బెంగళూరులో నమోదైన కేసుల సంఖ్య 20 వేలకు పైగానే ఉంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించడం ఏ మత్రం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావించింది. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు కూడా వాయిదా వేయాలనే కోరుతున్నాయి. అధికార యంత్రాంగం సైతం ఎన్నికల నిర్వహణ పట్ల పెద్దగా మొగ్గు చూపట్లేదు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినట్లు కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప వెల్లడించారు.