కరోనా ఎఫెక్ట్: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం


బెంగళూరు: అన్ని రాష్ట్రాల తరహాలోనే కర్ణాటకలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. అడ్డు, అదుపు లేకుండా చెలరేగిపోతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న బెంగళూరు.. చివురుటాకులా వణికిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 36,556 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క బెంగళూరులో నమోదైన కేసుల సంఖ్య 20 వేలకు పైగానే ఉంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించడం ఏ మత్రం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావించింది. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు కూడా వాయిదా వేయాలనే కోరుతున్నాయి. అధికార యంత్రాంగం సైతం ఎన్నికల నిర్వహణ పట్ల పెద్దగా మొగ్గు చూపట్లేదు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసినట్లు కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప వెల్లడించారు.

Advertisement
Advertisement

ఎన్నికలను వాయిదా వేసినందున.. ప్రత్యేకాధికారులను నియమిస్తామని ఆయన అన్నారు. రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ అదికారులతో సమావేశమైన అనంతరం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సుమారు మూడున్నర కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంందని, పోలింగ్ నిర్వహించడానికి అనుకూలమైన పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. ఎన్నికల వాయిదాపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, ఓ తీర్మానాన్ని ఆమోదిస్తామని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. ఏటేటా బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించే ద్రౌపది కరగ శాఖ్త్యోత్సవను కూడా వాయిదా వేసినట్లు తెలిపారు.

Read more...

English Summary

Amid the surge in covid-19 cases, the Karnataka government has decided to postpone Zilla Panchayat and Taluq panchayat election. Also thinking to appoint administration in those Zilla and Taluq panchayat, said Rural Development Minister KS Eshwarappa.