విజయ్ కు నటి రంజిత నిత్యానందమయి మెసేజ్
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. డీఎంకే- 59, ఏఐఏడీఎంకే- 47, కాంగ్రెస్- 5, పీఎంకే- 4 సీట్లు స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కాగా- ఈ పరిణామాల మధ్య తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై టీవీకే చర్యలు ప్రారంభించింది. ప్లాన్ బీ అమలు చేయనుంది. ఈ విషయంలో ఇప్పటికే అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి కూడా. కాంగ్రెస్, పట్టాళి మక్కల్ కచ్చి (PMK) టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా రెండేసి మంత్రి పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల మధ్య తమిళ మాజీ నటి రంజిత అలియాస్ మా నిత్యానందమయి స్వామి తెరమీదికి వచ్చారు. విజయ్కు అభినందనలు తెలిపారు. నిత్యానంద శిష్యురాలైన రంజిత.. కైలాస దేశం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు. నిత్యానంద తనను తాను సర్వసత్తాకంగా ప్రకటించుకున్న దేశం.. కైలాసం. అక్కడి నుండి మా నిత్యానందమయి స్వామి ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కైలాసం ప్రధానమంత్రి హోదాలో నిత్యానంద ఈ మెసేజీని పంపినట్లు రంజిత పేర్కొన్నారు. ఈ విజయం పట్ల స్వామి నిత్యానంద హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. తమిళనాడు ప్రజలు, విజయ్ ప్రభుత్వానికి ది సుప్రీం పాంటిఫ్ ఆఫ్ హిందూయిజం భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం దీవెనలు ఉండాలని ఆకాంక్షించారామె. తమిళనాడు ప్రజలకు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
హిందూయిజం బలం, ధార్మిక నాయకత్వాన్ని మార్గనిర్దేశం చేసే భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఆశీస్సులు లభించుగాక.. అని రంజిత పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు సంప్రదాయ ద్రవిడ రాజకీయాల్లో మార్పును తీసుకుని రావడాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications