ఏదో తేడా కొడుతోంది శీనా
లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆధిపత్యం చాటింది. ఈ ఉత్కంఠ పోరులో డక్వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా, అనంతరం బెంగళూరు అదే 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది.
నిజానికి, ఏక్నా స్టేడియం లక్నో సూపర్ జెయింట్స్ కు కలిసి రావట్లేదు. పరాజయాలకు పర్యాయపదంగా మారింది. ఇక్కడ పరుగుల రాక నిలకడగా లేదు, కీలక సమయాల్లో బౌలింగ్ పట్టుతప్పింది. గత సీజన్ నుండి ఎనిమిది వరుస ఓటములతో లక్నో జట్టుకు సొంత మైదానమే ప్రతికూలంగా మారింది. గురువారం రాత్రి ఆర్సీబీతో మ్యాచ్కు ముందు లక్నో పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదు. ప్లేఆఫ్ ఆశలు ఇప్పటికే సన్నగిల్లాయి. జట్టుపై ఒత్తిడి పెరుగుతూ, సీజన్ చేజారిపోతున్న స్థితిలో ఉంది.

ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్, ప్రిన్స్ యాదవ్ దీని దశనే పూర్తిగా మార్చేశారు. పవర్ ప్లే సమయంలో మార్ష్ నెట్ సెషన్ లాగా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ ఆర్సీబీపై ఒత్తిడి పెంచాడు. ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ 56 బంతుల్లో 111 పరుగులతో బెంగళూరు బౌలర్లకు ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. వర్షం అంతరాయాల వల్ల మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించినా, మార్ష్ దూకుడు తగ్గలేదు. జోష్ హేజిల్వుడ్, రసిఖ్ దార్ను కూడా దండించాడు.
అర్షిన్ కులకర్ణితో కలిసి మార్ష్ మొదటి వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, నికోలస్ పూరన్ మెరుపు వేగంతో 38 పరుగులు చేసి ఒత్తిడిని కొనసాగించాడు. ఆ తర్వాత, రిషభ్ పంత్ తన మార్క్ వింటేజ్ విధ్వంసం చూపాడు. పంత్ 10 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేశాడు. రివర్స్ స్వీప్ సిక్స్, సింగిల్ హ్యాండ్ ఫోర్.. ఇలా అతని బ్యాటింగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో ఎల్ఎస్జీ స్కోర్ 200 దాటింది.
213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ తేడా.. ఆటలో చివరి వరకు అలాగే కొనసాగింది. ప్రిన్స్ యాదవ్.. జట్టు తలరాతను మార్చేశాడు. మహమ్మద్ షమీతో కలిసి వికెట్లను కూల్చాడు. జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ వికెట్లను కోల్పోవడంతో ఆర్సీబీకి కష్టాలు తప్పలేదు. రజత్ పటిదార్ 31 బంతుల్లో 61 పరుగులు, దేవదత్ పడిక్కల్ క్రీజ్ లో ఉన్నప్పుడు పటిష్టంగా కనిపించిన బెంగళూరు.. వీరిద్దరూ అవుట్ అయ్యాక బలహీనపడింది.
టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 17 బంతుల్లో 40 పరుగులు బాదాడు. గెలుపు దిశగా సాగుతున్న సమయంలో షాబాజ్ అహ్మద్ అతన్ని బలి తీసుకున్నాడు. చివరి ఓవర్కు 20 పరుగులు అవసరం కాగా.. రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా క్రీజులో ఉండటం ఆర్సీబీలో ఆశలు రేకెత్తించింది. చివరి ఓవర్ ను దిగ్వేష్ రాఠీకి అప్పగించడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. చివరి ఓవర్ ను కట్టదిట్టంగా వేశాడు దిగ్వేష్ రాఠీ. రొమారియో చివరి ఓవర్లో బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో లక్నో 9 పరుగులతో విజయాన్ని అందుకుంది.












Click it and Unblock the Notifications