ఒక్క ఫోన్ కాల్ తో మారిన యుద్ధం: UAE కోసం నెతన్యాహు సంచలన నిర్ణయం
రెండు నెలలుగా ఇరాన్-అమెరికా మధ్య సాగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు ఒక అనూహ్య మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉన్న ఇజ్రాయెల్- అరబ్ దేశాల మధ్య రక్షణ బంధం ఊహించని స్థాయికి చేరుకుంది. తన అత్యంత శక్తివంతమైన 'ఐరన్ డోమ్' (Iron Dome) వైమానిక రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారిగా ఒక అరబ్ దేశానికి, అది కూడా అత్యంత రహస్యంగా తరలించినట్లు వెల్లడైంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులతో అల్లాడుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను కాపాడేందుకు ఇజ్రాయెల్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ తన ఆయుధాగారంలోని సుమారు 560 బాలిస్టిక్ క్షిపణులు, 2,250కి పైగా డ్రోన్లతో యూఏఈపై విరుచుకుపడుతున్న తరుణంలో.. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న నెతన్యాహు, మరుక్షణమే ఇజ్రాయెల్ రక్షణ దళాలను (IDF) రంగంలోకి దింపారు. కేవలం యంత్రాలనే కాకుండా, వాటిని నడిపే నిపుణులైన ఆపరేటర్లను కూడా యూఏఈకి పంపడం ద్వారా ఇజ్రాయెల్ తన చిత్తశుద్ధిని చాటుకుంది. అమెరికా వెలుపల ఈ వ్యవస్థను అందుకున్న తొలి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించింది.

శత్రువుకు చుక్కలు చూపిస్తున్న 'సెలెక్టివ్ ఇంటర్సెప్షన్'
90 శాతానికి పైగా సక్సెస్ రేటు ఉన్న ఐరన్ డోమ్, యూఏఈ గగనతలానికి రక్షణ కవచంగా మారింది. ఈ వ్యవస్థలోని 'సెలెక్టివ్ ఇంటర్సెప్షన్' సాంకేతికత అద్భుతం. ఇది శత్రువు ప్రయోగించిన క్షిపణులలో ఏవి జనావాసాలపై పడతాయో, ఏవి ఖాళీ ప్రదేశాల్లో పడతాయో ముందే గుర్తించి.. ముప్పు ఉన్న వాటిని మాత్రమే గాలిలోనే పేల్చివేస్తుంది. దీనివల్ల వృధా ఖర్చులు తగ్గడమే కాకుండా రక్షణ వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. ఈ టెక్నాలజీ సాయంతో ఇరాన్ ప్రయోగించిన డజన్ల కొద్దీ డ్రోన్లను యూఏఈ విజయవంతంగా కూల్చివేసింది.
మిత్రుడెవరో తెలిసింది.. మరి సౌదీ సంగతేంటి?
ఈ సంక్షోభం సమయంలో ఇజ్రాయెల్ అందించిన సహాయాన్ని యూఏఈ ఎన్నటికీ మర్చిపోలేదని ఎమిరాటీ అధికారులు చెబుతున్నారు. "నిజమైన కష్టకాలంలో ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే మాకు తోడుగా నిలిచాయి" అని యూఏఈ జాతీయ భద్రతా మండలి మాజీ అధికారులు బహిరంగంగానే కొనియాడుతున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. ఇరాన్ దాడులకు గురవుతున్న మరో దేశం సౌదీ అరేబియాకు మాత్రం ఇజ్రాయెల్ ఈ రక్షణ వ్యవస్థను అందించలేదు. దీనికి బదులుగా సౌదీ అరేబియా అమెరికాను ఆశ్రయించడం, ఇరాన్పై దాడులను తీవ్రతరం చేయాలని ట్రంప్ను కోరడం గమనార్హం.
పశ్చిమ ఆసియాలో కొత్త కూటమికి పునాది!
2020లో జరిగిన 'అబ్రహం అకార్డ్స్' తర్వాత ఇజ్రాయెల్-యూఏఈల మధ్య సంబంధాలు చిగురించాయి. మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినా, ప్రస్తుత ఇరాన్ యుద్ధం వీరిద్దరినీ మరింత దగ్గర చేసింది. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఇది కేవలం ఒక రక్షణ ఒప్పందం మాత్రమే కాదు, భవిష్యత్తులో పశ్చిమ ఆసియా అంతటా ఒక సమగ్ర వైమానిక రక్షణ నెట్వర్క్ (Integrated Air Defense Network) ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన వేసిన పునాది. ఇరాన్ బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ - అరబ్ దేశాలు చేతులు కలపడం టెహ్రాన్కే కాకుండా, ప్రపంచ దేశాలకు కూడా ఒక బలమైన సంకేతం పంపింది.














Click it and Unblock the Notifications