త్వరలో ఏపీ కేబినెట్ ప్రక్షాళన-హోంమంత్రిగా పవన్-రఘురామ షాకింగ్..!
త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల రెండో వారంలో మోడీ కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా పలు మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మోడీ కేబినెట్ ప్రక్షాళన తర్వాత ఏపీలో చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన కూడా ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (raghurama krishnam raju) ఇవాళ హింట్ ఇచ్చారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై రఘురామ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో తానే హోంమంత్రిని అయితే అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఇవాళ రఘురామకృష్ణంరాజు స్పందించారు. పవన్ ఏదైనా చెప్పారంటే అందులో కచ్చితంగా అర్దం ఉంటుందని, ఎందుకంటే కూటమిలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ అయిన జనసేనకు ఆయన అధ్యక్షుడని రఘురామ తెలిపారు. తాను హోంమంత్రి అయితే క్రిమినల్స్ తాట తీస్తానంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యల్ని కూడా రఘురామ సమర్థించారు.

త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన జరుగుతుందని, అనంతరం రాష్ట్రంలోనూ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని అంటున్నారని రఘురామ వెల్లడించారు. అందులో హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ కు అవకాశం దక్కనుందని రఘురామ జోస్యం చెప్పారు. అప్పుడు తనకు వ్యతిరేకంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్న క్రిమినల్స్ పై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. దీంతో కేబినెట్ ప్రక్షాళన గురించి రఘురామ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.













Click it and Unblock the Notifications