పెద్దపల్లి: తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. కారు, సంఘటనా స్థలం నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి వారిద్దరు బంగారు వ్యాపారులై ఉండొచ్చని భావిస్తున్నారు.
మృతులను కొత్త శ్రీనివాస్, రాంబాబుగా గుర్తించారు. హైదరాబాద్లో బంగారాన్ని కొనుగోలు చేసి నరసరావుపేటకు బయలుదేరి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారులో డ్రైవర్ సహా నలుగురు ఉన్నారు. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తోన్న నంబర్ ఏపీ 07 సీడబ్ల్యూ 4005 కారు పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద ప్రమాదానికి గురైంది. మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో రాంబాబు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.