ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు తానా భారీవిరాళం; ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.25 కోట్ల వైద్య పరికరాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా తెలుగు రాష్ట్రాలకు తమవంతు సహాయాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.25 కోట్ల విలువైన వైద్య పరికరాలను పంపిణీ చేయనుందని తాజాగా తానా చైర్మన్ లావు అంజయ్య చౌదరి తెలిపారు . అమెరికా నుంచి సముద్ర రవాణా ద్వారా తెప్పిస్తున్న ఈ పరికరాలు డిసెంబర్ 27న వైజాగ్కు చేరుకుంటాయని, ఆపై వీటిని వివిధ ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరం మేరకు అందిస్తామని తానా చైర్మన్ లావు అంజయ్య చౌదరి వెల్లడించారు
మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. చికాగోకు చెందిన నార్త్ వెస్ట్రన్ మెమోరియల్ హెల్త్ కేర్ ఈ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. తానా రెడ్క్రాస్తో కలిసి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పరికరాలను అందజేయడానికి సిద్ధమైందని, మరియు పరికరాలు అవసరమైన ఆసుపత్రులను రెడ్క్రాస్ గుర్తిస్తోందని లావు అంజయ్య చౌదరి వెల్లడించారు. తానా 1977 సంవత్సరంలో ఏర్పాటైందని 2008 నుంచి సేవా కార్యక్రమాలను విస్తృతం చేసిందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తమ సంస్థ విశేషంగా కృషి చేస్తోందని, ప్రస్తుత పరిస్థితులలో అవసరాలకు తగ్గట్టుగా వైద్య పరికరాలను అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖపట్నంలో తన తొలి పర్యటనకు వచ్చిన లావు అంజయ్య చౌదరి విశాఖపట్నం లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్లో 40,000 మందికి పైగా శాశ్వత సభ్యులు ఉన్నారని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పలు రకాల సేవా కార్యక్రమాలలో తానా ముందుందని, అమెరికాలో చదువుకోవాలి అనుకునే వారికి కూడా తానా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని లావు అంజయ్య చౌదరి వెల్లడించారు.
తానా టీమ్ సభ్యుల చొరవ 40,000 మందికి గుండె శస్త్రచికిత్సలు, పలువురికి కంటి చికిత్సలు, 4,000 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్రూమ్లను ఏర్పాటు చేయడంలో సహాయపడిందని ఆయన తెలిపారు. గ్రేస్ ఫౌండేషన్ మరియు బసవతారకం ఇండో-అమెరికన్ హాస్పిటల్తో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 150 క్యాన్సర్ శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని లావు అంజయ్య చౌదరి వెల్లడించారు.












Click it and Unblock the Notifications