ఇంటర్ ఫలితాల్లో తప్పు జరిగినట్లు తేలిపోయింది, ఇప్పుడు ఎవరిపై చర్యలు తీసుకోవాలి: మీ కామెంట్ చెప్పండి
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం ఇంకా కొనసాగుతోంది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల కల్లా తుది ఫలితాలు వెల్లడించాలని కోర్టు గడువు విధించినా బోర్డు మాత్రం తాపీగా రాత్రి 9.30గంటలకు అసంపూర్ణ ఫలితాలు విడుదల చేసింది. 3 లక్షల 82 వేల 116 మంది విద్యార్థుల జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసిన బోర్డు అధికారులు.. 1,137 మంది పాసయ్యారని ప్రకటించారు.
ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. విపక్ష పార్టీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చి రీవెరిఫికేషన్ ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో కూడా అయోమయం నెలకొనడం మరింత గందరగోళానికి కారణమైంది. జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంచాలన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కారు. వెబ్సైట్లో పాసైన విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే పెట్టడం అనుమానాలకు తావిస్తోంది.
ఆత్మహత్య చేసుకున్న 23 మంది విద్యార్థుల్లో ముగ్గురు పాస్ కాగా.. 20 మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్లోనూ ఫెయిలయ్యారని బోర్డు అధికారుల ప్రకటించారు. కొంతమంది విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో రీవెరిఫికేషన్కు అప్లై చేశారు. అయితే వీరి ఫలితాల వెల్లడికి మరో మూడు రోజుల సమయం పడుతుందని బోర్డు అధికారులు ప్రకటించారు. మొత్తమ్మీద రీ వెరిఫికేషన్లో 1,137 మంది పాస్ కావడం ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. అదే రీవాల్యుయేషన్ చేస్తే మరికొన్ని వేల మంది పాస్ అయ్యేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకూ ఇంటర్ ఫలితాల్లో తప్పంతా బోర్డుదేనని తేలిపోయింది. మరి దీనికి కారకులు ఎవరు? ఎవరిని బాధ్యలు చేసి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.