Diabetis:నోటిలో ఈ సమస్యను గుర్తిస్తే అజాగ్రత్త వద్దు.. వెంటనే డాక్టరును సంప్రదించండి..!!
డయాబెటిస్ లేదా మధుమేహం అనేది ప్రస్తుతం అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో ఒకటి. పదేళ్ల క్రితం ఈ సమస్య ఎక్కువగా వృద్ధులలో కనిపించేది. వారే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడేవారు. ఇప్పుడు చాలామంది అతి చిన్నవయసులోనే ఈ ప్రమాదకర మధుమేహం బారిన పడుతున్నారు. అయితే జీవనశైలిలో మనం అవలంబిస్తున్న అలవాట్లే మనలను మధుమేహానికి దగ్గర చేస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా డయాబెటిస్ కేసులు పెరిగిపోతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరంలోని రక్తంలో చక్కెర అధికంగా ఉండటంవల్ల కూడా డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ రెండు రకాలని వైద్యులు చెబుతున్నారు. ఒకటి టైప్ 1 డయాబెటిస్. అంటే జన్యుపరంగా ఈ వ్యాధి వస్తుంది. రెండవది శరీరంలో క్రొవ్వు, అధిక రక్తపోటు(బీపీ)తక్కువ నిద్ర, జీవనశైలిలో భాగంగా మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలున్నాయి.
మధుమేహం వ్యాధిని సకాలంలో గుర్తిస్తే చికిత్స కూడా సులభంగానే ఉంటుంది. అయితే కాస్త ఆలస్యం జరిగితే మాత్రం శరీరంలోని ఇతర అవయవాలకు సోకి ప్రమాదకరంగా మారుతుంది. ఇక టైప్ 1, టైప్ 2 డయాబెటిస్లకు సంబంధించి రెండిటి మధ్య సాధారణ లక్షణం కనిపిస్తుంది. అది పొడిగొంతు. ఈ సమయంలో రోగి నోరు ఎక్కువగా ఎండిపోవడం మొదలవుతుంది. అంతేకాదు రోగికి అధిక దాహం కలుగుతుంది. దీంతో నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. మధుమేహం కారణంగా నాలుక లేదా నోటిలో మంట కలుగుతుంది. కొందరికి నాలుక తిమ్మిరగా ఉండటంతో పాటు దురద కూడా కలిగే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనుక గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది.
డయాబెటిస్ వచ్చిన వారిలో శరీరంలోని రోగనిరోధక శక్తి క్రమంగా బలహీనపడటం జరుగుతుంది. లేదా చాలా నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అంతేకాదు శరీరానికి ఏమైనా గాయాలైతే రక్తంలో అధిక చక్కెర ఉండటంవల్ల చికిత్స ప్రక్రియపై ఇది ప్రభావం చూపిస్తుంది. దీంతో గాయాలు మానేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది డయాబెటిస్ కారణంగా జరుగుతుంది. అందుకే పైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుది.
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దంతాల సమస్యలు పెరుగుతాయి. చిగుళ్ల చుట్టూ దంతాల మధ్య అంతరం రావడం ప్రారంభమవుతుంది. దీంతో దంతాల పట్టు దెబ్బతిని వదులవుతాయి. ఇతర వ్యాధులు సోకిన వారితో పోలిస్తే డయాబెటిస్ పేషెంట్లలో దంతాలు తొందరగా విరిగిపోతాయని పలు పరిశోధనల ద్వారా వెల్లడైంది. వృద్ధులు లేదా నోటి సమస్యతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో డయాబెటిస్ ద్వారా చిగుళ్లపై వాపు లేదా పంటి నొప్పి వచ్చే అవకాశాలున్నాయి.
నోరు పొడిబారుతోందన్న సమస్యను గుర్తిస్తే జాగ్రత్తగా ఉండండి. వాస్తవానికి నోటిలోని లాలాజలం ఉత్పత్తిపై రక్తంలో చక్కెర స్థాయి ప్రభావం చూపుతుంది. మధుమేహం నియంత్రణలో లేకుంటే లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో నోరు పొడిబారుతుంది. కాలక్రమేణా ఈ సమస్యతో నోటిలో పుండ్లు వస్తాయి. తరుచుగా నోరు పొడిబారితే అది మధుమేహానికి సంకేతంగా గుర్తించాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించొద్దు. మధుమేహం ఉన్నవారిలో అనేక కారణలతో నోటిలో లేదా నాలుకపై ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.