AP Dsc 2025: మెగా డీఎస్సీలో వయో పరిమితి పెంపు డిమాండ్లు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 10 నెలలుగా అభ్యర్ధుల ఎదురుచూపులు ఫలించాయి. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్ధులు డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే డీఎస్సీ పరీక్షల కోసం ప్రభుత్వం ఇచ్చిన వయో పరిమితి విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన వయో పరిమితిని మరింత పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి డీఎస్సీతో పాటు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మాత్రమే. కానీ ప్రభుత్వం ఈసారి డీఎస్సీ ఆలస్యం అయిందనే కారణంతో ఈ ఒక్క పరీక్షకు మాత్రమే 44 ఏళ్లకు దీన్ని పొడిగించింది. అయితే ఇది కూడా సరిపోదని అభ్యర్ధులు చెప్తున్నారు. ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలు రాసేందుకు విధించిన గరిష్ట వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని వారు కోరుతున్నారు. దీని వెనుక వారు పలు కీలక కారణాలను చెప్తున్నారు.

డీఎస్సీ పరీక్ష చాలా సంవత్సరాల తర్వాత నిర్వహిస్తుండటం, గత ప్రభుత్వం సగంలోనే డీఎస్సీ పరీక్ష నిలిపేయడం, కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా వెంటనే పరీక్ష నిర్వహించకపోవడం వంటి కారణాలను అభ్యర్ధులు చెప్తున్నారు. వీటి కారణంగా ఈ ఒక్క డీఎస్సీ వరకైనా వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. వీరికి రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సీపీఐ రామకృష్ణ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు డీఎస్సీ అభ్యర్ధుల వయో పరిమితి పెంపుపై లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయటం హర్షణీయమని సీపీఐ రామకృష్ణ తెలిపారు. అయితే 2018 తర్వాత ఇప్పుడు మెగా డీఎస్సీ విడుదల చేయటంతో అభ్యర్థులు వయోపరిమితి గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కాబట్టి మెగా డీఎస్సీలో ఉద్యోగార్దులకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచుతూ తగు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును రామకృష్ణ కోరారు. ఇప్పటికే ఓసారి వయో పరిమితి పెంచిన ప్రభుత్వం అభ్యర్ధుల తాజా డిమాండ్లపై ఈసారి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి..












Click it and Unblock the Notifications