AP KGBV Admissions: కేజీబీవీల్లో అడ్మిషన్ల గడువు పెంపు-పూర్తి వివరాలివే..!
ఆంధ్రప్రదేశ్ లోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV)ల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 7 తరగతులతో పాటు 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లకు అడ్మిషన్లపై ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ కేజీబీవీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోని వారి కోసం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్వశిక్ష అధికారులు ఇవాళ వివరాలు వెల్లడించారు.
కేజీబీవీల్లో బాలికల నుండి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 20 వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి శుక్రవారంతో (ఏప్రిల్ 10) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. దీన్ని పొడగించాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీడీ తెలిపారు. ఇంకా దరఖాస్తు చేయనివారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని కేజీబీవీల్లో అన్ని తరగతులకు సంబంధించి మొత్తం 32,079 సీట్లు కేటాయించగా, శుక్రవారం నాటికి 69,362 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కేజీబీవీల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న నాణ్యమైన విద్యను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులు భారీగా వస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తున్నట్లు తెలిపారు. https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తారు. అలాగే సంబంధిత స్కూలు నోటీసు బోర్డులో కూడా చూసుకోవచ్చు. సమస్యలు, సందేహాలకు 7993329115, 70750 39990 నంబర్లు పని వేళల్లో సంప్రదించాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications