భారత్ వచ్చే విదేశీ విద్యార్ధులకు శుభవార్త-రెండు ప్రత్యేక వీసాల ప్రారంభం..!
విదేశాల నుంచి భారత్ కు ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్ధులకు కేంద్రం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా రెండు కేటగిరీల వీసాల్ని ప్రారంభించింది. ఈ రెండు కేటగిరీలు ఎవరెవరికి వర్తిస్తాయి, వీసాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ వాటిని పొందాలన్న దానిపై పూర్తి వివరాలను కేంద్రం వెల్లడించింది. ఇకపై భారత్ కు వచ్చే విదేశీ విద్యార్ధులు ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
భారత్ లో చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్ధుల కోసం కేంద్రం ఇవాళ ఈ-స్టూడెంట్ వీసా, ఈ-స్టూటెండ్-ఎక్స్ వీసాలను ప్రారంభించింది. ఇందులో ఈ-స్టూడెంట్ వీసాను విదేశాల నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చే విద్యార్ధులకు జారీ చేస్తారు. ఈ-స్టూడెండ్-ఎక్స్ వీసాను వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులకు జారీ చేస్తారు. ఈ వీసాలు కావాల్సిన విదేశీ విద్యార్ధులు ఇకపై indianvisaonline.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల ఎస్ఐఐ ఐడీల ఆధారంగా దరఖాస్తుల్ని పరిశీలించి ఆమోదిస్తారు. భారత్ లో దీర్ఘకాలిక కోర్సులు, స్వల్పకాలిక కోర్సులు చదవాలనుకునే విద్యార్ధులకు ఈ వీసాల్ని జారీ చేస్తారు. దేశంలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులందరికీ ప్రత్యేకమైన ఎస్ఐఐ ఐడీ మాత్రం తప్పనిసరి. ఇది వారి కళాశాల దరఖాస్తులను ట్రాక్ చేయడానికి, వీసాలు లేదా ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, భారత్ కు సంబంధించిన ఇతర ఉన్నత విద్య పూర్తి చేసే ప్రక్రియలలో
వినియోగిస్తారు.
భారత్ లో ఇలా జారీ చేసే అంతర్జాతీయ విద్యార్థి వీసాల గడువు గరిష్టంగా ఐదేళ్ల వరకూ ఉంటుంది. కోర్సుల ఆధారంగా వాటిని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే అవసరాన్ని బట్టి వీసాల గడువు పొడిగింపు కూడా కోరవచ్చు. ఇ-స్టూడెంట్ వీసా భారతదేశంలో చదువుకోవడానికి ప్రవేశం పొందిన విదేశీ పౌరులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ స్థాయి, ఇతర అధికారిక ప్రోగ్రామ్లలో రెగ్యులర్, ఫుల్ టైమ్ కోర్సులను చేయాలనుకునే వారికి మంజూరు చేస్తారు.












Click it and Unblock the Notifications