Education News: సీట్ల స్కాం అనంతరం కర్ణాటక కీలక నిర్ణయం.. కొత్త విధానంతో అవకతవకలకు చెక్
Karnataka exams: మొదట ఓ ధ్రువీకరణ పత్రంగా పరిచయం చేసిన ఆధార్ కార్డు ఇప్పుడు అన్నింటా తానుగా వ్యవహరిస్తోంది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మనిషి మరణించే వరకు ప్రతి పనిలోనూ తప్పనిసరి కీలక డాక్యుమెంట్గా మారిపోయింది. ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఆధార్ వినియోగం మరింత ఎక్కువవుతోంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది.
వచ్చే సంవత్సరం నుంచి ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లు పొందాలనుకునే విద్యార్థుల కోసం ఆధార్ లింక్డ్ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసే కొత్త విధానాన్ని కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (KEA) ప్రతిపాదించింది. ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లు బ్లాక్ చేయడాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టాలని చూస్తోంది. KEA ప్రస్తుతం ఈ ఆలోచనను రాష్ట్ర ఈ-గవర్నెన్స్ డిపార్ట్మెంట్ ముందు పెట్టింది.

'ఆధార్ లింక్డ్ రిజిస్ట్రేషన్ను ప్రామాణీకరణ కోసం ప్రతిపాదించాము. రిజిస్ట్రేషన్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా మరియు పరీక్షలకు సంబంధించిన సమాచారం నేరుగా విద్యార్థుల మొబైల్ ఫోన్లకు చేరేలా చేయడమే మా ఉద్దేశం. ఈ-గవర్నెన్స్ విభాగం మా ప్రతిపాదనకు మద్దతు ఇస్తోంది. వారు దానిని భారత ప్రభుత్వం ఆమోదం కోసం పంపించారు. మేము త్వరలో అనుకూలమైన ప్రతిస్పందన పొందుతామని ఆశిస్తున్నాము' అని KEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ H ప్రసన్న తెలిపారు.
ఇటీవల కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (KCET) కోటా కింద సీట్ల బ్లాకింగ్ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత KEA ఈ దిశగా ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపులో అన్ని రౌండ్లు పూర్తయిన అనంతరం ఈ విషయం బయటపడింది. కొందరు విద్యార్థులు ఒకే IP అడ్రస్ను ఉపయోగించి సీట్లు బ్లాక్ చేసినట్లు తేలింది. KEAకి ఇచ్చిన మొబైల్ నంబర్లు మరియు ఈమెయిల్ ఐడీలు కూడా తప్పుగా ఉన్నట్లు గుర్తించబడటంతో నష్టనివారణ చర్యలకు దిగినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications