NEET-PG exams: పరీక్షలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు బాంబు పేల్చిన కేంద్రం
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. గుజరాత్లో 10 లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పేపర్లను అమ్ముకున్నారంటూ వార్తలు రావడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 1,563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కలవడం వంటి వివాదాలు నీట్ పరీక్షలను చుట్టుముట్టాయి.
నీట్ కౌన్సెలింగ్ను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అటు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం వంటి పరిణామాలు వేగంగా సంభవిస్తోన్నాయి. కౌన్సెలింగ్ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నీట్- పీజీ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. మళ్లీ ఎప్పుడు వీటిని నిర్వహిస్తారనేది ఇప్పటికిప్పుడు వెల్లడించలేదు. కొత్త తేదీని ఇంకా నిర్ధారించలేదు.
ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని రకాల కాంపిటీటివ్ పరీక్షల నిర్వహణలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని నీట్- పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపింది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశాలు ఇచ్చినట్లు వివరించింది.
షెడ్యూల్ ప్రకారం.. నీట్ పీజీ పరీక్షలు ఈ ఉదయం 10:30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. 52 వేల వరకు ఉన్న నీట్-పీజీ సీట్ల కోసం రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షలను రాయాల్సి ఉంది. నిమిషం ఆలస్యం అయినా పరీక్షలు రాయనివ్వకపోవడం అనే నిబంధన ఉండటం వల్ల దూర ప్రాంత విద్యార్థులందరూ ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
పరీక్షల కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యారు. ఇలాంటప్పుడు కేంద్రం వీటిని వాయిదా వేయడం విమర్శలకు దారి తీసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువు అయ్యారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితంతో ఆటలాడుకుంటోన్న కేంద్రమంత్రి తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఇది వరకే కేంద్ర ప్రభుత్వం యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు వివరించింది. పేపర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం కావడమే దీనికి కారణమని చెబుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications