యూజీసీ నెట్ పరీక్ష రద్దు: ఎన్టీఏ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: నీట్ (NEET)లో అవతవకలు జరిగాయంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంచలన ప్రకటన చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ (UGC- NET) పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ బుధవారం ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది.
నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం రావడంతో యూజీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను కాపాడటం కోసమే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది.

పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా పరీక్ష నిర్వహించబడుతుందని, దాని గురించిన సమాచారాన్ని విడిగా పంచుకుంటామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యవహారాన్ని సమగ్ర విచారణ కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రతి సంవత్సరం (జూన్, డిసెంబర్) రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్ష - భారతీయ ఇన్స్టిట్యూట్లలో 'అసిస్టెంట్ ప్రొఫెసర్' అలాగే 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్' అర్హతను నిర్ణయిస్తుంది.
మరోవైపు, నీట్ పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపైన కూడా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. పాట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని చెప్పింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్ లో అవకతవకలు జరిగినట్లు నిర్ధరణకు వచ్చామని, బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications