గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం 15 వరకు: టీఎస్పీఎస్సీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్ 4కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 8180 గ్రూప్-4 పోటీస్లుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 30 నుంచి ఈ ఏడాది జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఈ క్రమంలో గ్రూప్-4 పోస్టులకు వచ్చిన దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు తాజాగా, టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.
మే 9వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు మరోసారి అవకాశం ఉండదని.. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది.

కాగా, మొత్తం 8180 గ్రూప్-4 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన పోటీ నెలకొనడంతో స్థానికతతోపాటు విద్యార్హతలు, కుల ధృవీకరణ వంటి పలు అంశాలు నియామక ప్రక్రియలో కీలకం కానున్నాయి. అందువల్ల దరఖాస్తు సమయంలో దొర్లిన పొరపాట్లను సరిచేసుకునేందుకు తాజాగా టీఎస్ పీఎస్సీ అవకాశం ఇచ్చింది. ఇక, తెలంగాణ గ్రూప్-4 పరీక్ష జులై 1న జరగనుంది.
పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామక పరీక్షల తేదీల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) మే నెలలో నిర్వహించనున్న పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామక పరీక్ష తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామక పరీక్షలను సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు రీషెడ్యూల్ చేసినట్లు కమిషన్ తెలిపింది.
మరోవైపు, మే నెల 17న ఇంటర్ విద్య, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications