రాష్ట్రాలకు యూజీసీ షాక్ ? కేంద్రం చేతుల్లోకి వీసీల నియామకాలు ?
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాలతో పాటు కాలేజీల్లో అధ్యాపకుల నియామకాల్ని సైతం రాష్ట్రాల నుంచి లాక్కుని కేంద్రం చేతుల్లో పెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. విద్య ఉమ్మడి జాబితాలో ఉందన్న సాకుతో ఇలా ఉన్నత విద్యారంగంలో కీలక నియామకాల్ని కేంద్రానికి బదిలీ చేసే విధంగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తెచ్చిన తాజా ముసాయిదా నిబంధనలు కలకలం రేపుతున్నాయి. ఇవి అమల్లోకి వస్తే రాష్ట్రాలకు షాక్ తప్పదు.
వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాల పనితీరుపై నియంత్రణ మాత్రం యూజీసీకి లేదు. కేవలం విద్యావిషయక అంశాలపై సూచనలు, సలహాలు, నిధుల కేటాయింపు వరకే యూజీసీకి అధికారాలున్నాయి. అయితే తాజాగా యూజీసీ తెచ్చిన ముసాయిదా నిబంధనల ప్రకారం యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, కాలేజీల్లో అధ్యాపకుల నియామకాలు సైతం కేంద్రం చేతుల్లోకి వెళ్లబోతున్నాయి.

ఇప్పటికే బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాలు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన వీసీలపై కేంద్రంతో పాటు యూజీసీ అడ్డుపుల్లలు వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వీసీల నియామకాన్ని కేంద్రం చేతుల్లో పెట్టేసేందుకు యూజీసీ సిద్దమవుతోంది. యూజీసీ తాజా రూల్స్ ప్రకారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్ల నియామకంలో ఛాన్సలర్లకు అధిక అధికారాలు కల్పిస్తారు. అలాగే వీసీల నియామక సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎవరూ ఉండరు.
రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్, కాబట్టి వైస్-ఛాన్సలర్లు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అలాగే వీసీగా నియమితులయ్యే వ్యక్తికి పీహెచ్డీ డిగ్రీ లేకపోయినా తగినంత బోధనానుభవం లేకపోయినా పర్వాలేదు. వ్యాపార, పాలనా రంగాల్లో ఉన్న ఎవరైనా వీసీగా నియామకం కావచ్చు. ఇది సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నమనే ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications