రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం.. ఆస్కార్ కమిటీ ఆహ్వానం!!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును దక్కించుకొని అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన దర్శకధీరుడు రాజమౌళి ఆయన భార్య రమా రాజమౌళి కి అరుదైన గౌరవం దక్కింది. ఎంతోమంది కలలుకనే ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాను వరించిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆ సినిమాలో నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ విభాగంలో అకాడమీ పురస్కారం లభించిన విషయం తెలిసిందే.
ఆస్కార్ అకాడమీలో చేరేందుకు రాజమౌళికి ఆహ్వానం
ఆర్ఆర్ఆర్ సినిమా టీం సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, సాబు సిరిల్, సెంథిల్ కుమార్ కూడా గతేడాది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో సభ్యత్వాన్ని పొందారు. ఇక తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన భార్య రమా రాజమౌళి ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళికి అవకాశం వచ్చింది.

487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం
కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. వీరిలో భారతదేశం నుంచి ఎస్ఎస్ రాజమౌళి, రమా రాజమౌళి తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.
ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారు వీరే
బాలీవుడ్ నటి షబానా అజ్మీ, నిర్మాత రితేశ్ సిద్వాని, దర్శక నిర్మాత రీమాదాస్, సినిమాటోగ్రాఫర్ రవివర్మ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తదితరులు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఆస్కార్ అకాడమీ ఒక పోస్ట్ ని కూడా తన అధికారిక సోషల్ మీడియా వేదికగా చేసింది.
అకాడమీ పోస్ట్
ఈ సంవత్సరం కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతోందని వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నారు.దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.












Click it and Unblock the Notifications