శ్రీలీలకు కొత్త తలనొప్పి: భాగ్యశ్రీ తర్వాత ఇప్పుడు కాయదు?
తమిళ స్టారో హీరో అజిత్ కుమార్ తదుపరి సినిమా "ఏకే64" హీరోయిన్ ఎంపిక గురించి కోలీవుడ్లో సరికొత్త ఊహాగానాలు, రూమర్లు చెలరేగుతున్నాయి. ఇటీవల డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వాణిజ్యపరంగా విజయం సాధించిన తర్వాత, అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్వయంగా అనేక ఇంటర్వ్యూలలో తన తదుపరి చిత్రం కోసం మరోసారి అజిత్ కుమార్తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అజిత్ కుమార్ తదుపరి చిత్రానికి దర్శకుడు ఇప్పటికే ఖరారైనప్పటికీ.. కొన్ని సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోందని, అజిత్ కుమార్ స్వయంగా ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారని ఇప్పుడు బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటి కాయదు లోహర్ ను చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాయదు లోహర్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందా లేదా మెయిన్ లీడ్ నటిగా మెరిపించనుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఈ ఊహాగానాలు కోలీవుడ్ వర్గాల్లో చాలా గందరగోళాన్ని సృష్టించాయి, ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన వార్తల ప్రకారం ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ చిత్రంలో కాయదు లోహర్ చేరడంతో ఆమె శ్రీలీల స్థానంలో కథానాయికగా వచ్చిందా లేక ఇద్దరు నటీమణులు ఈ చిత్రంలో భాగమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదలైన 'లెనిన్'సినిమాలో మొదట శ్రీలీలనే హీరోయిన్గా ఎంపికైంది. శ్రీలీల టీజర్లో కూడా కనిపించింది. కానీ కొన్ని కాల్ షీట్ సమస్యల కారణంగా ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఆ తర్వాత భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. 'లెనిన్' విడుదలైన తర్వాత, శ్రీలీలకు బదులుగా భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నందుకు చిత్ర బృందాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు, ఎందుకంటే ఆమె అద్భుతంగా నటించిందని వారు భావిస్తున్నారు.
'లెనిన్' సినిమా చేజారిన కొద్ది రోజుల్లోనే అజిత్ 'ఏకే 64'లో కాయదు లోహర్ గురించిన వదంతులు రావడంతో సోషల్ మీడియాలో శ్రీలీలపై ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే ఈ ఊహాగానాలు నిజమై కాయదు లోహర్ 'ఏకే 64'లో అజిత్ కుమార్ సరసన నటిస్తే.. అది కోలీవుడ్లో ఆమె మొదటి పెద్ద బడ్జెట్ చిత్రం అవుతుంది. ఈ చిత్రంలో తన నటనతో ఆమె మంచి ముద్ర వేయగలిగితే, అది ఆమెను పరిశ్రమలో ఓ ప్రముఖ నటిగా ఎదగడానికి సహాయపడుతుంది.
ఇదిలా ఉండగా కొంతమంది అజిత్ కుమార్ అభిమానులు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కేవలం ఊహాగానాలు మాత్రమే చక్కర్లు కొడుతున్నాయని, కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదని కామెంట్ చేస్తున్నారు. సినిమా ఇంకా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లకుండానే హీరోయిన్ మార్పుల గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కామెంట్ చేస్తున్నారు. ఈక్రమంలో వారు AK64 చిత్ర బృందాన్ని త్వరగా చిత్రీకరణ ప్రారంభించమని కోరడం మొదలుపెట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో కాయదు లోహర్ ఉందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.














Click it and Unblock the Notifications