తిరుపతి లడ్డూపై పవన్ కల్యాణ్, కార్తీ ఏం గేమ్ ఆడారులే?
తిరుపతి లడ్డూ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇందులో కల్తీ నెయ్యి వాడారని, ఆ నెయ్యిలో పంది కొవ్వు, జంతువుల మాంసంతో తయారుచేసిన నూనె లాంటి పదార్థాలను కలిపారంటూ దుమారం రేగుతోంది. గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుకు చెందిన ల్యాబ్ కు పంపించగా నెయ్యి కల్తీ అయినట్లు తేలింది. దీంతో దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయ మెట్లను శుభ్రం చేయడంతోపాటు రేపు తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారి దర్శించుకొని దీక్షను విరమించనున్నారు.
నవ్వుతూ సమాధానం చెప్పడంతో
ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే సత్యం సుందరం ప్రమోషన్స్ లో ఉన్న కార్తీని విలేకరులు లడ్డూపై ప్రశ్నించగా ఇది చాలా సున్నితమైన అంశమని, స్పందించేందుకు నిరాకరించారు. కాకపోతే ఆయన ఈ సమాధానాన్ని నవ్వుతూ చెప్పారు. అపహాస్యం చేస్తూ సమాధానం చెప్పారని భావించిన పవన్ కార్తీపై మండిపడ్డారు. వెంటనే కార్తీ క్షమాపణలు చెప్పారు. అనవసరమైన విషయానికి కార్తీచేత క్షమాపణలు చెప్పించారంటూ తమిళ సమాజం మండిపడింది.

ప్రచారం కోసం వాడుకున్నారా?
అయితే ఈ విషయాన్ని ప్రచారం కోసం వాడుకున్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై వీరిద్దరి మధ్య రేగిన దుమారం వల్ల సత్యం సుందరం సినిమాకు మంచి ప్రచారం వస్తుందని కార్తీ భావించారు. తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఏ సందర్భంగా కార్తీ అలా మాట్లాడారనేది తనకు అర్థమైందని, సినిమా బాగా ఆడాలంటూ విషెస్ చెప్పారు. పవన్ ట్వీట్ చేసిన వెంటనే కార్తీ స్పందించడంవల్ల సామాజిక మాధ్యమాలతోపాటు తెలుగు, తమిళంలో అతనిపై, అతని సినిమాపై పాజిటివిటీ బాగా పెరిగింది. అది సత్యం సుందరం సినిమాకు ఉపయోగపడింది. ఇప్పటికే తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని సనాతన ధర్మంతో ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications