తీవ్ర విషాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. ఆయన ఇకలేరు !
ప్రముఖ కోలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు 'షిహాన్ హుస్సైనీ' తుదిశ్వాస విడిచారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో హుస్సైనీ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ కు హుస్సైనీనే మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ ఇచ్చారు.
సినీ ప్రయాణం..
1986లో విడుదలైన 'పున్నగై మన్నన్' చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు హుస్సైనీ. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు స్టార్ హీరో విజయ్ నటించిన 'బద్రి' సినిమా మంచి గుర్తింపునిచ్చింది. చివరగా ఆయన విజయ్ సేతుపతి నటించిన కేఆర్కే చిత్రంలో కనిపించారు. హాలీవుడ్ చిత్రం బ్లడ్ స్టోన్ లో కూడా ఆయన నటించారు.

ఆర్చరీ..
కరాటే మాస్టర్గానే కాకుండా ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్న ఆయన సుమారు 400 మందికి పైగా విద్యార్థులను తయారుచేశారు. తమిళనాడులో ఆధునిక విలువిద్యకు ఆయనను మార్గదర్శకుడుగా అభివర్ణిస్తారు.
పవన్ సంతాపం..
ఇక ఈ క్రమంలోనే తన గురువు మరణించడం పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యానని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది. వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్ళి హుస్సైనీ గారిని పరామర్శించాలని నిర్ణయించుకొన్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. హుస్సైనీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చారు
అలానే చెన్నైలో హుస్సైనీ కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని. తొలుత ఆయన కరాటే నేర్పేందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకొన్నారు. తెల్లవారుజామునే వెళ్ళి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో కథానాయక పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకొనేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు- నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుస్సైనీ శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుస్సైనీ తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు షిహాన్ హుస్సైనీ గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా 3 వేల మందికి పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ అందించడమే కాకుండా, తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడంలో ఆయన సేవలు మరువలేనివి. ఆయన… pic.twitter.com/GMZYqqqv8Q
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 25, 2025
హుస్సైనీ ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులు, శిల్పి. పలు చిత్రాల్లో నటించారు. స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్, ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకువెళ్ళేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుస్సైనీ మార్షల్ ఆర్ట్స్ ను యువతీయువకులకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయాలని ప్రకటించడం - ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది. హుస్సైనీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని వాపోయారు.












Click it and Unblock the Notifications