నువ్వు మామూలోడివి కాదు బాసూ..!
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. 'దండోరా' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నటి అనసూయ వంటి సెలబ్రిటీలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించగా, ఈ వ్యవహారం చివరకు తెలంగాణ మహిళా కమిషన్ వరకు వెళ్లింది.
అనిల్ రావిపూడి రియాక్షన్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా ఈ విషయంపై అనిల్ను ప్రశ్నించింది. ఇటీవల విడుదలైన 'మెగా విక్టరీ మాస్ సాంగ్' సూపర్ హిట్ కావడంతో ఆ జోష్లో ఉన్న అనిల్, శివాజీ వివాదంపై చాలా హుందాగా స్పందించారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరికి నచ్చినట్లు వారు జీవించే హక్కు అందరికీ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మనం చేసే వ్యాఖ్యలు మరిన్ని విమర్శలకు దారి తీయవచ్చు అని ఆయన సంయమనంతో చెప్పారు.

శివాజీ హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్ చేసే సమయంలో అనిల్ రావిపూడి ఆ స్టేజ్పైనే ఉన్నారు. కానీ ఈ ఘటనపై ఆయన అప్పుడు స్పందించలేదు. తాజా ఈ వివాదంపై మీడియా ప్రశ్నంచడంతో చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు శివాజీ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. మంచి చెప్పబోతే విమర్శలు వస్తున్నాయని, అనవసర విషయాల్లో తలదూర్చకూడదని తనకు అర్థమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు ఈ వివాదాలు నడుస్తున్నా, అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 'మెగా విక్టరీ మాస్ సాంగ్' యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండటం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.












Click it and Unblock the Notifications