పాన్ వరల్డ్ మూవీగా హాలీవుడ్ స్థాయిలో విడుదలవుతోన్న ఎన్టీఆర్ డ్రాగన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కల్యాణ్ రామ్, యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుక్మిణి వసంత్ కథానాయిక. టీ సిరీస్ పై గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలకన్నా ఎక్కువ దేశాల్లో విడుదల చేయాలనే యోచనలో నిర్మాతలున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ కు ఆ తర్వాత వచ్చిన దేవర, వార్2 చిత్రాలు అనుకున్న స్థాయిలో మద్దతివ్వలేకపోయాయి. అభిమానులు కూడా ఈ సినిమాలతో నిరాశ పడ్డారు.
తెలుగు నుంచి అంతర్జాతీయస్థాయికి
కేజీఎఫ్ కోసం కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్ కోసం ఖాన్సార్ సామ్రాజ్యాలను ప్రశాంత్ నీల్ సృష్టించారు. అలాగే డ్రాగన్ కోసం సృష్టిస్తున్న ప్రపంచం భారతదేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయస్థాయిలో ఉండే సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారు. దీనివల్ల అన్ని దేశాల ప్రేక్షకులకు చేరువవుతామని ఆలోచిస్తున్నారు. దీనికోసం ఈ సినిమా షూటింగ్ ను పలు దేశాల్లో చిత్రీకరించనున్నారు. తర్వాత షెడ్యూల్ అక్టోబరు నుంచి ప్రారంభం కాబోతోంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి అంతర్జాతీయస్థాయిలో మహేష్ బాబు - రాజమౌళి, అల్లు అర్జున్ - అట్లీ, శ్రీకాంత్ ఓదెల - నాని ప్యారడైజ్ మూవీలు విడుదల కాబోతున్నాయి.

ఇంటర్నేషనల్ డ్రాగన్
ఇప్పుడు వీటి సరసన డ్రాగన్ చేరింది. సినిమా బాగుంటే కాసులు కురిపించడం ఖాయమనే నమ్మకంతో ఉన్న నిర్మాతలు భారీగా ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే హాలీవుడ్ కు చెందిన సంస్థలతో సినిమా ప్రమోషన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. భారత్, భూటాన్, చైనా దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ కథతో రూపొందుతోందని ఒకరు, స్వాతంత్ర్య సమరయోధుడి కథతో రూపొందుతోందని మరొకరు అంటున్నారు. చిత్ర బృందం నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ ఈ సినిమాతో పలు అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పాలనే పట్టుదలతో హీరో, దర్శకుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications