Thittam Irandu:హత్య చేసింది ఎవరు? క్రైమ్ థ్రిల్లర్ లవర్స్కు పర్ఫెక్ట్ మూవీ..!!
మూవీ లవర్స్కు ఓటీటీలపై వచ్చే సినిమాలకు కొదవే లేదు. కొన్ని వందల సంఖ్యలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఓటీటీలు రాబోతున్నాయి. థియేటర్లలో సినిమా చూడాలని భావించి మిస్ అయిన వాళ్లకు ఓటీటీలు మంచి వేదికగా మారాయి. కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాలు కనుక మీరు మిస్ అయ్యుంటే వాటిని ఏదో ఒక ఓటీటీపై పొందొచ్చు. అంతేకాదు మనకు నచ్చిన జార్నర్ సినిమాలు ఓటీటీలపై అందుబాటులో ఉన్నాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్స్ జార్నర్లో బోలెడు సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాల్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించి ఇక్కడ చెప్పుకుందాం.
తిట్టం ఇరందు-గుడ్ క్రైమ్ థ్రిల్లర్
క్రైమ్ థ్రిల్లర్స్కు కేరాఫ్ అడ్రస్గా తమిళ మళయాల సినీ ఇండస్ట్రీలు పేరుగాంచినవి. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా అక్కడి క్రైమ్ థ్రిల్లర్స్ తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చిత్రం నిజ జీవిత ఆధారంగా తెరకెక్కలేదు కానీ, సినిమా చూసిన తర్వాత సమాజంలో ఇలాంటి వారుంటారా అనే ఫీల్ తప్పక కలుగుతుంది.ఈ తమిళ సినిమా పేరు తిట్టం ఇరందు (ప్లాన్ బి). ఐశ్వర్య రాజేష్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ చిత్రం చూస్తున్న ప్రేక్షకుడిని సీటు పై నుంచి లేవనివ్వదు. అంతలా మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఇది 2021లో తమిళంలో విడుదలైంది. అయితే ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉంది.

కథ ఏంటి...?
ఇక కథ విషయానికొస్తే...అధిర (ఐశ్వర్య రాజేష్) ఒక పోలీస్ ఆఫీసర్. చెన్నైలో పోస్టింగ్. కుంభకోణం నుంచి చెన్నైకి బస్సులో వెళుతున్న సమయంలో అర్జున్ (సుభాష్ సెల్వం) అనే సహ ప్రయాణికుడితో పరిచయం ఏర్పడి అది క్రమంగా ప్రేమగా మారుతుంది.ఇక చెన్నైలో పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఓ రోజు తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన దీపా సూర్యా (అనన్య రామప్రసాద్) భర్త నుంచి ఫోన్ కాల్ వస్తుంది. సూర్య ఇంట్లో కనిపించడం లేదని తెలుపుతాడు. ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఓ కారు ప్రమాదానికి గురైందని..అందులో ఓ మహిళ శరీరం పూర్తిగా కాలిపోయిందని ఫోన్ వస్తుంది. యాక్సిడెంట్ సీన్ దగ్గరకు వెళ్లిన అధిరకు అది యాక్సిడెంట్ కాదు.. మర్డర్ అని అనుమానిస్తంది. ఇక ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ వేగవంతం అవుతుంది.
ట్విస్టుల మీద ట్విస్టులు
అయితే చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం ఈ హత్య చేసింది ఎవరో అని అనుమానం కలిగేలా డైరెక్టర్ విఘ్నేష్ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు. దీపా సూర్య హత్య వెనుక తన మాజీ ప్రేమికుడి హస్తం ఉందా.. లేక సూర్య భర్త కిషోర్ (గోకుల్ ఆనంద్)ఈ హత్య చేశాడా అన్న అనుమానాలు సినిమా చూసే ప్రతి ఒక్కరిలో వస్తాయి.ఇక ఈ హత్య వెనుక ఎవరెవరున్నారనేది బయట పడేలోపే మరో బిగ్ ట్విస్ట్ వస్తుంది. అసలు కారు ప్రమాదంలో చనిపోయింది దీప సూర్య కాదని తేలుతుంది. అది మరెవరో. దీంతో సినిమా మరో పీక్ స్టేజ్కు వెళుతుంది. ఇలా ప్రతి సీన్ ట్విస్టుల పై ట్విస్టులు సస్పెన్స్ను క్రియేట్ చేస్తూ సగటు ప్రేక్షకుడికి మంచి ఫీల్ ఇస్తుంది.
డోన్ట్ మిస్ ది క్లైమాక్స్
ఇక చివరి 20 నిమిషాలు మాత్రం అస్సలు మిస్ కాకూడదు. సినిమా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. అసలు దీపా సూర్య నిజంగానే మృతి చెందిందా..? ఒక వేళ హత్య చేయబడి ఉంటే ఆమె బాడీ ఎక్కడ, ఇందులో హీరో అర్జున్ (సుభాష్ సెల్వం) క్యారెక్టర్ ఏంటి..థర్డ్ జెండర్ క్యారెక్టర్ను దర్శకుడు ఎందుకు పెట్టాడు..? చివరిలో ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్ ఏంటి..?తామే హత్య చేశామంటూ చెబుతున్న వారంతా ఎందుకు ఒకే చోటికి చేరి పోలీస్ ఆఫీసర్ అథిర ( ఐశ్వర్య రాజేష్)కు స్టేట్మెంట్ ఇస్తారు..? చివరికి హీరో అర్జున్ను అథిర పెళ్లి చేసుకుంటుందా లేదా అనే చాలా ట్విస్టులు తెలియాలంటే "తిట్టం ఇరందు" మూవీని చూడాల్సిందే. ఇది తెలుగులో సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా చూశాక మీరు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ను చూసి ఆస్వాదించారనే ఫీలింగ్ కలుగుతుంది.














Click it and Unblock the Notifications