సూపర్ స్టార్ కు కేంద్రం నుంచి తీపికబురు
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్కు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. భారత సినీ పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆయన అందుకోనున్నారు. చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి కిందటే అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.
2023 సంవత్సరానికి మోహన్ లాల్ కు ఈ అవార్డు లభించింది. మోహన్లాల్ సినీ ప్రస్థానం అనేక తరాలకు స్ఫూర్తిదాయకమని సమాచార మంత్రిత్వ శాఖ 'ఎక్స్' వేదికగా తెలిపింది. ఆయన అయిదు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడీ మలయాళ సూపర్ స్టార్. ఉత్తమ నటుడిగా రెండు, జ్యూరీ ప్రత్యేక అవార్డులు మూడు, నిర్మాతగా ఒక ఉత్తమ చలనచిత్రం పురస్కారాన్ని పొందారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 350కి పైగా విభిన్న పాత్రలలో మోహన్లాల్ జీవించారు. ఆయన పోషించిన ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లాలేట్టన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మోహన్లాల్ కేరీర్ లో ఇది అత్యుత్తమ సినీ పురస్కారంగా చెప్పుకోవచ్చు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఆయన తీసిన ఒక్కో మూవీ కూడా ఒక్కో డైమండ్.
గత ఏడాది 2022కి దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి అందుకున్న విషయం తెలిసిందే. మోహన్లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన వార్త వెలువడగానే- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలియజేశారు. తన ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు.
మోహన్లాల్ ను మల్టీ టాలెంటెడ్ యాక్టర్ గా అభివర్ణించారు మోదీ. దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు ఎంతగానో సేవలను అందించారని కొనియాడారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా ఆయన అద్భుతమైన సినిమాల్లో నటించారని ప్రశంసించారు.ఆయన సినీ, రంగస్థల ప్రతిభ నిజంగా స్ఫూర్తిదాయకమని అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించినందుకు ఆయనకు అభినందనలు.. ఆయన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉండాలి" అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications