ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 కాదు..2030 వరకు నో పాలిటిక్స్: వేణుస్వామి
ఎన్టీఆర్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నాకు మాత్రమే తెలుసు.. 2030 వరకు పాలిటిక్స్ నో.. అంటూ టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో పాటు ఆయన వ్యక్తిగత వివరాలపై వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
గతంలో సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను విశ్లేషిస్తూ నిత్యం వివాదాల్లో నిలిచే వేణు స్వామి.. 2024 ఎన్నికల ఫలితాలు, నాగ చైతన్య-శోభితల పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ఫెయిల్ కావడంతో విమర్శలు, మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం ఎదుర్కొని కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. అయితే తాజాగా మళ్లీ నెమ్మదిగా బయటకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ జాతకంపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.

2030లో రమ్మనమని చెప్పా
ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ, "జాతకం రీత్యా 2030 వరకు తారక్ రాజకీయాల్లోకి వచ్చే స్కోప్ లేదు. ఒకవేళ అంతకంటే ముందే వస్తే ఆయన గెలిచే అవకాశాలు చాలా తక్కువ. 2030లోనే రమ్మని నేనే అతనికి చెప్పాను. అంతేకాదు, ఎన్టీఆర్ బయట జరుపుకునే పుట్టినరోజు వేరు, ఆయన అసలైన పుట్టినరోజు వేరు. ఆ ఒరిజినల్ డేట్ కేవలం నాకు మాత్రమే తెలుసు" అంటూ చెప్పుకొచ్చారు. వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జాతకాల పేరుతో హీరో వ్యక్తిగత వివరాలపై దారుణమైన ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలను అస్సలు క్షమించబోమని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీలే చెప్పాలి
మరోవైపు, ఎన్టీఆర్ ఇటీవల 'డ్రాగన్' సినిమా షూటింగ్లో గాయపడటంతో భుజానికి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తారక్ కోలుకునే వరకు ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరందుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్ పట్ల సంతృప్తిగా లేరని, అందుకే ఈ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టి 'సలార్ 2' పనుల్లోకి షిఫ్ట్ అయ్యారనేది ఆ రూమర్ సారాంశం. ఇందులో ఎంతవరకు నిజముందో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చెబితేకానీ తెలియదు.














Click it and Unblock the Notifications