పహల్గాం దాడి..! తన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ క్లారిటీ
Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల జరిగిన 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ఎవరినీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్నారు. మనమంతా ఐక్యంగా ఉండాలని చెప్పారు.
'నేను 'రెట్రో' ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ వర్గాన్నీ, ఏ తెగనూ బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. భారతదేశంలోని ప్రజలంతా ఒక్కటేనని భావిస్తాను. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా నిలబడాలి' అని విజయ్ దేవరకొండ అన్నారు.

ఇంకా, 'నేను ఏ సమూహంపైనా ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబసభ్యులు, నా సోదరులే అని అనుకుంటాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి గురించి మాట్లాడటమే నా ఏకక లక్ష్యం' అని విజయ్ దేవరకొండ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
చారిత్రక, నిఘంటు దృష్టి కోణంలోనే నేను ఆ పదాన్ని ఉపయోగించాను. వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్స్ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ అనేది జరిగింది. అలా జరిగి కనీసం 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ రెట్రో ప్రీరిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిపై మండిపడ్డారు. ఉగ్రవాదులకు బ్రెయిన్ ఉండదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే వందల ఏళ్ల క్రితం ట్రైబ్స్ కొట్టుకున్నట్లు అంటూ దాడినుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, గిరిజనులను విజయ్ అవమానించారంటూ తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది కిషన్ రాజ్ చౌహాన్, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications