ఇట్స్ అఫీషియల్.. ఇక నుంచి సమంత రాజ్ నిడిమోరు
గత కొంతకాలంగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నటి సమంత రుతు ప్రభు వివాహం సోమవారం తెల్లవారుజామున నిరాడంబరంగా జరిగింది. దర్శకుడు-నిర్మాత అయిన రాజ్ నిడిమోరును సమంత వివాహమాడారు. కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక కేంద్రమైన ఈశా యోగా సెంటర్లోని పవిత్ర లింగ భైరవి దేవాలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యేలా నిరాడంబరంగా నిర్వహించారు. సమంతకు ఈశా యోగా సెంటర్తో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. తరచుగా ఈ కేంద్రాన్ని సందర్శించే సమంత, ఇక్కడే తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఈ శుభకార్యం జరిగినట్లుగా తెలుస్తోంది.
వివాహం అనంతరం సమంత స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలలో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు విడుదలైన వెంటనే ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి, అభిమానులు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పెళ్లిలో సమంత ఎరుపు రంగు పట్టు చీరలో సంప్రదాయబద్ధంగా చాలా అందంగా కనిపించారు. రాజ్ నిడిమోరు క్రీమ్, గోల్డ్ రంగుల కుర్తా ధరించి చూడముచ్చటగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమబంధంలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వారిద్దరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

2021లో తన భర్త నాగ చైతన్యతో విడిపోయిన ప్రముఖ నటి సమంత రుతు ప్రభు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారారు. ఏళ్ల తరబడి డేటింగ్ చేసి 2017లో గోవాలో పెళ్లి చేసుకున్న ఈ మాజీ జంట.. నాలుగేళ్ల తర్వాత విడిపోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ తమ తమ జీవితాలతో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా.. సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా మొదలైంది. రాజ్, కృష్ణ డీకే కలిసి ఈ సిరీస్కు దర్శకత్వం వహించారు. అప్పటినుంచి వీరి మధ్య ఏర్పడిన అనుబంధం కారణంగానే వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి ముంబైలో అనేక సార్లు కనిపించడం, సమంత సోషల్ మీడియాలో ఆప్యాయతతో కూడిన పోస్టులు చేయడం ఈ బంధానికి బలం చేకూర్చింది.
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారని తెలియడంతో అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారిద్దరు కలకాలం సంతోషంగా జీవించాలని పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications