రోజుకు 3 సార్లు నగ్నంగా నిలబెట్టేవారు.. తీహార్ జైలు అనుభవాలపై నటి ఆవేదన!
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, నటి సందీపా విర్క్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయానకమైన దినాలను గుర్తుచేసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రూ.6 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సందీపా విర్క్ దాదాపు నాలుగున్నర నెలల పాటు ఢిల్లీలోని తీహార్ జైలులో గడపాల్సి వచ్చింది. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న సందీపా విర్క్.. జైలులో తాను అనుభవించిన దారుణ పరిస్థితులను, అవమానాలను బయటపెట్టారు.
జైలులో ఖైదీలను తనిఖీ చేసే పద్ధతి అత్యంత అమానుషంగా ఉంటుందని సందీపా చెప్పుకొచ్చారు. లోపలికి వెళ్లగానే సిబ్బంది బట్టలు విప్పించి ప్రైవేట్ పార్టులపై టార్చ్ లైట్ వేసి తనిఖీ చేస్తారని.. చలికాలంలోనూ ఇష్టారీతిన దుస్తులు తొలగించి అవమానిస్తారని వాపోయారు. ఇంత కఠినంగా శరీరాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు జైలు లోపలికి మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ ఎలా వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. జైలులో డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒక రోజులోనే రెండు మూడు సార్లు దుస్తులు ఊడదీసి తనిఖీలు చేసేవారని.. ఆ వందలాది తనిఖీల సమయంలో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని సందీపా విర్క్ వెల్లడించారు. "మహిళా సిబ్బందే కదా చూస్తోంది, దుస్తులు తీస్తే తప్పేంటి?" అని కొందరు తేలికగా మాట్లాడుతున్నారని సందీపా విర్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా జైలులోని ఆహారం, టాయిలెట్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండేవని.. మొదటిరోజే తనను 25-26 మంది ఉన్న గదిలో నెట్టివేశారని సందీపా విర్క్ గుర్తుచేసుకున్నారు. నిరంతం జరిగిన మానసిక వేధింపులు, ఒత్తిడి తట్టుకోలేక తాను జైలులో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించినట్లు కన్నీటిపర్యంతమయ్యారు.














Click it and Unblock the Notifications
