కష్టమే?.. మళ్లీ మొదటికొచ్చిన 'పుష్ప2'... మ్యూజిక్ డైరెక్టర్ మార్పు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం పుష్ప2. ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ దీనికి అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఎన్నెన్నో అవాంతరాలు. ఎట్టకేలకు అవన్నీ దాటుకొని సినిమా విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపి డిసెంబరు ఐదోతేదీన అని అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సినిమాపై క్రేజ్ కూడా అంచనాలకు మించి ఉంది. అయితే ఈ సినిమాకు మరో అడ్డంకి వచ్చి చేరినట్లు సమాచారం.
వేరే సంగీత దర్శకులవైపు చూస్తున్న సుకుమార్
ఇప్పటికే సన్నివేశాలు సరిగా రాలేదని దర్శకుడు సుకుమార్ రీషూట్ చేస్తున్నారంటూ తెలుగు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సుకుమార్ ఎంతో ఇష్టపడే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సరిగా రాలేదని, వేరే సంగీత దర్శకులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఎంత కష్టపడుతున్నప్పటికీ దేవిశ్రీప్రసాద్ నుంచి అనుకున్న స్థాయిలో బీజీఎం రాలేదు. పుష్ప1 చిత్రంలో పాటలు బాగున్నప్పటికీ నేపథ్య సంగీతం విషయంలో మాత్రం బాగోలేదనే విమర్శలు వచ్చాయి. సినిమాకు మూడు సంవత్సరాల సమయం తీసుకున్నప్పటికీ దేవిశ్రీప్రసాద్ నుంచి చిత్ర యూనిట్ తమకు కావల్సిన రీతిలో బీజీఎంను తీసుకోలేకపోయి చివరి నిముషంలో హడావిడి పడుతోంది.

అజనీష్ లోక్ నాథ్ ఇస్తున్నారంటున్నారు
కాంతార చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన అజనీష్ లోక్ నాథ్ పుష్ప2కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారంటున్నారు. తమన్ ఇస్తాడా? అజనీష్ ఇస్తాడా? అనే విషయంలో స్పష్టత రాలేదు. ఇటీవలే హైదరాబాద్ లో మ్యూజిక్ షో ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ ఈ సమయాన్ని పుష్ప2కు వెచ్చించివుంటే మంచి సంగీతం అందేది. కానీ ఆ షోకు కేటాయించగా అది అట్టర్ ఫ్లాప్ అయింది. సుకుమార్ కూడా దేవిశ్రీప్రసాద్ ను వద్దనుకుంటున్నారంటే మున్ముందు సినిమాలు రావడం దేవీకి కష్టమే అవుతుంది. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ సంగీతం వాడి తగ్గిందంటున్నారు. అందుకు తగ్గట్లుగా తనను నమ్ముకున్న దర్శకులకు వారు కోరుకున్న రీతిలో సంగీతం ఇవ్వలేకపోతే చివరి నిముషంలో హడావిడి పడటం మినహా చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.












Click it and Unblock the Notifications