మామయ్యా... టికెట్ ధరలు పెంచుకుంటాం: జూనియర్ ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. 26వ తేదీ అర్థరాత్రి ఒంటిగంట నుంచి ప్రత్యేక షోలు వేయనున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి చాలా సులువుగానే రానుంది.
మౌనంగానే ఉండిపోయిన తారక్
ఇటీవలే వరదలకు ఏపీకి, తెలంగాణకు చెరో రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి తారక్ ప్రకటించారు. ప్రస్తుతం తారక్ దేవర సినిమాపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు నెగెటివిటీని వ్యాపింప చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో స్పందించకపోవడంతోపాటు, కొడాలి నాని, వల్లభనేని వంశీలను నియంత్రించకపోవడం, అసెంబ్లీలో భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలతో చంద్రబాబు కళ్లనీళ్లు పెట్టుకోవడంలాంటి సందర్భాల్లో ఒక్కసారి కూడా తారక్ నోరు విప్పలేదు. మౌనంగా ఉండిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు దేవర చిత్రంపై తీవ్రస్థాయిలో నెగెటివిటీని ప్రచారం చేస్తున్నాయి.

ఎలా అడ్డుకోవాలో అర్థం కావడంలేదు
దీన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాని జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి, తన మామయ్య అయిన చంద్రబాబును కలవబోతున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ తో కలిసి అమరావతి సచివాలయానికి వెళ్లి అక్కడ విరాళాలకు సంబంధించిన చెక్కులను ఇద్దామనుకున్నారు. అయితే హైదరాబాద్ లోనే చంద్రబాబును కలిసి చెక్కులను అందజేస్తారని తెలుస్తోంది. ఈ సమయంలోనే సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కావాలని చంద్రబాబును కోరే అవకాశం ఉంది. ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరు కల్యాణ్ రామ్ కాగా మరొకరు మిక్కిలినేని సుధాకర్. దీంతో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరాల్సిన బాధ్యత కూడా తారక్ పై పడింది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడంతోపాటు టికెట్ ధరల పెంపును సాధించుకుంటారా? లేదా? అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.












Click it and Unblock the Notifications