Fact Check: దావూద్ ఇబ్రహీం చనిపోయాడా ? ఇంటెల్, అనుచరుడు ఛోటా షకీల్ క్లారిటీ !
90వ దశకంలో జరిగిన ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి, భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం కొన్నేళ్లుగా పారిపోయి పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నాడు. అక్కడ దావూద్ పై విష ప్రయోగం జరిగినట్లు ఇవాళ ఉదయం నుంచీ వార్తలు గుప్పుమన్నాయి. విష ప్రయోగం తర్వాత దావూద్ ను ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో భారత నిఘా వర్గాలు దావూద్ ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించాయి.
ఈ నేపథ్యంలో భారత నిఘా వర్గాలు దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్లు వచ్చిన వార్తలను ఖండించాయి. ఓ పాకిస్తానీ యూట్యూబర్ అర్థరాత్రి ఈ మేరకు దావూద్ పై వీడియో షేర్ చేయడంతో ఈ ప్రచారం జరిగినట్లు నిర్ధారించారు. ఈ వీడియో ఆధారంగానే దావూద్ పై ఊహాగానాలు చెలరేగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నిజంగానే దావూద్ పై విష ప్రయోగం జరిగినట్లు అంతా భావించారని తెలుసుకున్నాయి.

మరోవైపు దావూద్ పై విషప్రయోగం జరిగిందని, అతను చనిపోయాడని వస్తున్న వార్తలపై అతని అనుచరుడు ఛోటా షకీల్ కూడా స్పందించాడు. జాతీయ మీడియా ఛానల్ సీఎన్ఎన్ న్యూస్ 18తో మాట్లాడుతూ ఈ వార్తల్ని ఖండించాడు. దావూద్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నాడని, ఈ ఫేక్ న్యూస్ చూసి తాను కూడా షాక్ అయ్యానని తెలిపాడు. తాను నిన్న దావూద్ ను చాలాసార్లు కలిశానని కూడా ఛోటా షకీల్ తెలిపాడు.

Fact Check
వాదన
దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరగడంతో అతను ఆస్పత్రి పాలై చనిపోయాడు.
వాస్తవం
దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడని, ఆరోగ్యంగా ఉన్నాడని నిఘా వర్గాలు నిర్ధారించాయి.












Click it and Unblock the Notifications